భవిష్యత్తు
అవసరాలకు తగ్గట్టు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘మిషన్ భగీరఽథ మంచినీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. అడుగు లోతులో వేసిన పైపులైన్లు అప్పుడే పగిలిపోయాయి. లీకేజీలతో కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయి. ఈ నీటిని తాగిన ప్రజలు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు’ అని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్నినో నేపథ్యంలో భూగర్భ జలాల పరిరక్షణ కోసం చేప ట్టాల్సిన చర్యలపై మంగళవారం కొంగరకలాన్లోని కలెక్టరేట్ భవన సముదాయంలో మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, తాండూరు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, వీర్లపల్లి శంకర్, మల్రెడ్డి రంగారెడ్డి, మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, అధికారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. కరువును ఎదుర్కొనేందుకు శాఖల వారీగా రూపొందించిన ప్రణాళికలపై చర్చించారు.
మంచినీరు రావడం లేదు
షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం పైపులైన్ల ద్వారా మంచినీరు సరఫరా కావడం లేదని తెలిపారు. ప్రభుత్వానికి అధికారులు తప్పుడు సమా చారం ఇస్తున్నారని అన్నారు.
తరచూ కరెంట్ పోతోంది
గ్రామీణ ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డిరంగారెడ్డి అన్నారు. సాంకేతిక లోపాలను ఎందుకు సరి చేయడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
గుక్కెడు నీళ్లవ్వకపోతే ఎలా..
మండలి చీఫ్విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. తాగేందుకు గుక్కెడు మంచినీరు కూడా ఇవ్వలేకపోతే ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని నిలదీశారు. అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, ప్రజల మధ్యకు వెళ్లలేని పరిస్థితి తలెత్తిందన్నారు.
అవగాహన కల్పించాలి
జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని జిల్లా ప్రత్యేకాధికారి వికాస్రాజ్ సూచించారు.
ఇంటికో ఇంకుడు గుంత
వాటర్ బోర్డు ఎండీ అశోక్రెడ్డి మాట్లాడుతూ.. భూగర్భ జలాలు రోజురోజుకూ లోతుకు పడిపోతున్నాయని తెలిపారు. ట్యాంకర్ల కోసం బుకింగ్స్ పెరిగినట్టు చెప్పారు. ఇంటికో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచించారు.
ప్రత్యామ్నాయపంటలు మేలు
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి కంటే కంది, మొక్కజొన్న, పెసర, అలసంద, ఆముదం వంటి పంటలు వేసుకోవడం ఉత్తమమని శాస్త్రవేత్త టి.రాజేశ్వర్రెడ్డి తెలిపారు.
స్పీకర్ ప్రసాద్కుమార్ మాట్లాడుతూ.. తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, అవసరమైతే వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని సరఫరా చేయాలని అన్నారు. ఒకవైపు నీటి వృథాతో కలిగే నష్టాలను వివరిస్తూనే.. మరోవైపు భూగర్భ జలాలను పరిరక్షించుకునే ప్రయత్నం చేయాలన్నారు. కురిసిన ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టుకోవాలని, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
నీటి ఎద్దడిని సమర్థంగా ఎదుర్కొందాం
భూగర్భ జలాలను పరిరక్షించుకుందాం
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి
ఎల్నినోపై ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం
హాజరైన స్పీకర్, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులు


