అమీర్పేట: భక్తుల కోర్కెలు తీర్చే బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం మంగళవారం కనులపండువగా జరిగింది. భక్తజన సందో హంతో ఆలయ పరిసరాలు పసుపుమయంగా మారాయి. పూజల అనంతరం సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదికపైకి ఉత్సవమూర్తులను తీసుకువచ్చి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఉదయం 11.51 గంటలకు ఉత్తర నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుముహూర్తంలో ఎల్లమ్మ కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పుస్తె, మెట్టెలు, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీఎం సతీమణి గీతారెడ్డి, కూతురు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. వేడుకల్లో మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతా బాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆల, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వెన్నెల, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, ఈఓ వినోద్రెడ్డి, ట్రస్టీ చైర్మన్ సాయిబాబా గౌడ్, జోగిని శ్యామల పాల్గొన్నారు.


