నకిలీ సీఫేరర్ పత్రాలతో దేశం దాటేందుకు యత్నం
● ఏప్రిల్ 4న హరియాణా, యూపీ పంజాబ్లకు చెందిన ఆర్యన్, ముకేశ్ కుమార్, రూప్ సింగ్ జెడ్డా మీదుగా లండన్ వెళ్లేందుకు యత్నిస్తూ పట్టుబడ్డారు.
● మే 2న పంజాబ్లోని కపూర్తల జిల్లా భగవాన్పూర్ గ్రామానికి చెందిన రైతు జషన్ప్రీత్ సింగ్ యూకేలోని మాంచెస్టర్కు వెళ్తూ దొరికిపోయాడు.
● మే 9న గుజరాత్కు చెందిన పంకజ్, రాజస్థాన్కు చెందిన హరికిషన్ భాయ్ భిక్కుభాయ్ టాండెల్ రియాద్ మీదుగా టర్కీకి వెళ్లాలని యత్నించారు.
● మే 19న రాజస్థాన్కు చెందిన లమోరియా శివ్రాజ్ విజయేంద్ర రాస్ అల్ ఖైమాకు వెళ్లే ప్రయత్నంలో చిక్కారు.
● జూన్ 8న ఉత్తరప్రదేశ్కు చెందిన దీపక్ చౌదరి, హరియాణాకు చెందిన అంజలి యూకేలోని మస్కట్ మీదుగా లండన్ వెళ్లే యత్నంలో పట్టుబడ్డారు.
సాక్షి, సిటీబ్యూరో: విదేశాలకు వెళ్లాలనుకునేవారితో ఒప్పందాలు చేసుకుని, నకిలీ సీఫేరర్ సర్టిఫికెట్లు తయారు చేసి, దేశం దాటించేలా పథకం వేస్తూ కొన్ని వ్యవస్థీకృత ముఠాలు పని చేస్తున్నాయా..? అంటే ఔననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. మూడు నెలల్లో నకిలీ సీఫేరర్ సర్టిఫికెట్లతో లండన్, యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లడానికి ప్రయత్నించిన తొమ్మిది మందిని శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. ఈ దందాపై ఐదు కేసులు నమోదయ్యాయి. వీటిని దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్)కు బదిలీ చేశారు. ఈ వ్యవహారాల వెనుక వ్యవస్థీకత ముఠా ఉందని సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆయా దేశాల్లో డిమాండ్ ఉండటంతో...
సముద్రంలో ప్రయాణించే వాణిజ్యనౌకలు, కార్గో షిప్లు, ఆయిల్ ట్యాంకర్లు, క్రూయిజ్ షిప్లు, ఆఫ్షోర్ నౌకలు వంటి వాటిలో పనిచేసే ఉద్యోగి. వీరిలో కెప్టెన్, డెక్ అధికారులు, మైరెన్ ఇంజినీర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, డెక్ సిబ్బంది, కుక్లను సీపేరర్ అంటారు. ఆయా దేశాల్లో ఈ పోస్టులకు చాలా డిమాండ్ ఉంది. సీఫేరర్ ఉద్యోగం చేయాలంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్(డీజీ షిప్పింగ్) గుర్తింపు పొందిన శిక్షణా సంస్థల్లో కోర్సులు పూర్తి చేయాలి. అనంతరం స్టాండర్డ్స్ ఆఫ్ ట్రైనింగ్, సర్టిఫికేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్టీసీడబ్ల్యూ) సర్టిఫికెట్లు, కంటిన్యూయస్ డిశ్చార్జ్ సర్టిఫికెట్(సీడీసీ) వంటి అధికారిక పత్రాలు పొందాలి.
ఆ ప్రయోజనాల కోసమే...
ఇటీవల కొందరు దళారులు నకిలీ సీఫేరర్ సర్టిఫికెట్లు తయారు చేసి యువతను విదేశాలకు పంపుతున్నట్లుగా కేసులు నమోదవుతున్నాయి. కొన్ని దేశాల్లో నౌకా సిబ్బందికి ఇచ్చే క్రూ వీసా లేదా సీమెన్ ట్రాన్సిట్ సౌకర్యాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి ముఠాల సహకారంతో విదేశాలకు వెళ్లినవారు అక్కడే అక్రమంగా స్థిరపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్, షిప్పింగ్ కంపెనీలు, విదేశీ పోర్ట్ అధికారులు డీజీ షిప్పింగ్ రికార్డులు, సర్టిఫికెట్ నంబర్లు, శిక్షణ సంస్థ వివరాలను డిజిటల్గా పరిశీలిస్తున్నారు.
మూడు నెలల్లో శంషాబాద్ ఎయిర్పోర్టులో 9 మంది అరెస్టు
సిటీ సీసీఎస్కు కేసుల బదిలీ
ఈ వ్యవహారంపై దర్యాప్తు అధికారుల ప్రత్యేక దృష్టి


