జర్నలిస్టుల పిల్లలకు వర్తింపజేస్తూ డీఈఓ ఉత్తర్వులు
ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ) యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీంపాషా ఆధ్వర్యంలో నాయకులు డీఈఓను కలవగా ఉత్తర్వు కాపీని అందజేశారు. ఈ సందర్భంగా సలీం పాషా మాట్లాడుతూ.. జిల్లాలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టుల పిల్లల చదువులకు ఉచిత విద్యనందించాలని కోరగా.. విద్యాధికారులు 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడం సంతోషమన్నారు. మండలాల్లో పని చేస్తున్న వారికి స్థానిక విద్యాధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, డీఈఓ వెంకటేశ్వర్లుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రవి, కరుణాకర్, భాస్కర్, శ్రీనివాస్, భార్గవ్, శివ తదితరులు పాల్గొన్నారు.


