హుడాకాంప్లెక్స్: సరూర్నగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో తక్కువలో తక్కువ 20 శాతం, ఎక్కువలో ఎక్కువ 50 నుంచి 70 శాతం పెరిగినట్టు సబ్ రిజిస్ట్రార్ రాంభూపాల్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్ విలువలు, అక్కడి వాస్తవ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం మార్కెట్ విలువ సవరించిందన్నారు. సరూర్నగర్ పరిధిలో గతంలో కొన్ని ప్రాంతాల్లో గజం రూ.21,000 ఉండేదని సవరించిన తర్వాత రూ.31,500 నుంచి రూ.40,100 పెరిగిందని తెలిపారు. కమర్షియల్ ధరలో కూడా మార్పులు జరిగాయన్నారు. గతంలో రూ.50,100 ఉన్న గజనం ధర సవరించిన తర్వాత రూ.56,100 నుంచి రూ. 75,200కు పెరిగిందన్నారు. అపార్ట్మెంట్లోని ఫ్లాట్ ఫీటు విలువ రూ.4వేల నుంచి రూ.4,500కు, రూ.5వేలు ఉన్న ప్రాంతాల్లో రూ.5,500కు పెరిగిందని వివరించారు. శుక్రవారం నుంచి పెరిగిన ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, కొనుగోలుదారులు సహకరించాలని ఆయన సూచించారు.


