తరలింపు సరికాదు
● కళాశాలతో పాటు 400 పడకల ఆస్పత్రి కందుకూరు మండలంలోనే నిర్మించాలి
● మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
కందుకూరు: రద్దు చేసిన మెడికల్ కళాశాల, ఆస్పత్రి నిర్మాణాలను కందుకూరు మండలంలోనే ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. మీర్ఖాన్పేట రెవెన్యూ పరిధిలో బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో మెడికల్ కళాశాల, 400 పడకల ఆస్పత్రిని కేటాయించి శంకుస్థాపన చేశారని.. ప్రజా ప్రభుత్వమని చెప్పుకొనే కాంగ్రెస్ మెడికల్ కళాశాలను రద్దు చేసి ఎల్బీనగర్కు తరలించడం సరికాదన్నారు. ఫ్యూచర్సిటీ అని చెప్పుకుంటూ పబ్బంగడుపుతున్న ప్రభుత్వం 400 పడకల ఆస్ప త్రి నిర్మాణం ఎందుకు చేపట్టడంలేదని సమాధానం చెప్పాలన్నారు. పేదలు అనారోగ్యం బారిన పడితే ఎంతో దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగితే హైదరాబాద్ తరలించే లోపు క్షతగాత్రుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రి నిర్మిస్తే శ్రీశైలం రహదారి, సాగర్ రహదారి మధ్య ప్రాంతంతో పాటు మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు, కల్వకుర్తి ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. రద్దు చేసిన మెడికల్ కళాశాల, ఆస్పత్రి నిర్మాణాలను వెంటనే కందుకూరు మండలంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశా రు. లేదంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ముదిరాజ్, జి.లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


