ఆమనగల్లు: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కాంగ్రెస్తోనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. పట్టణంలో సోమవారం పలువురి లబ్ధిదారుల ఇళ్లను ప్రారంభించగా.. వారు ఆయనను సన్మానించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డిలతో కలిసి మాట్లాడారు. నీటి వనరులు సరిగ్గా లేని నియోజకవర్గానికి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు తెస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు వట్టెం నుంచి నీరు అందించేందుకు డీపీఆర్ రూపొందించినట్లు పేర్కొన్నారు. ఎత్తిపోతలకు ఇటీవల రూ.వెయ్యి కోట్లు మంజూరు అయ్యాయని, ఈ నెల 4,5 తేదీలలో సీఎం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించి, పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించి, వాటిని పూర్తి చేయడానికి ప్రాధాన్యత చూపుతున్నారని వెల్లడించారు.
రాజకీయాలకు అతీతంగా..
టీఆర్ఎస్ పాలనలో ఎత్తిపోతల పథకం పనులు 30 శాతం మాత్రమే జరిగాయని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రజాపాలన సాగుతోందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని, నియోజకవర్గానికి రెండో విడతలో రెండు వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. పెండింగ్లో పనులకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్, మాజీ అధ్యక్షుడు మండ్లి రాములు, పట్టణ అధ్యక్షుడు మానయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి ఫరీద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్, సంపత్కుమార్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, మల్లయ్య, ప్రసాద్, బాబా, కృష్ణనాయక్, రాఘవేందర్, విజయ్ రాథోడ్ పాల్గొన్నారు.
లక్ష ఎకరాలకు ప్రణాళిక
కాంగ్రెస్తోనే ప్రజలకు సమన్యాయం
కల్వకుర్తికి 2 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి


