తుర్కయంజాల్: పండ్ల మార్కెట్ నిర్మాణం పేరుతో ఎస్సీ, ఎస్టీల భూములను లాక్కోవడం దారుణమని బీజేపీ జిల్లా నాయకుడు కందాల బల్దేవ్ రెడ్డి, కొత్త అశోక్ గౌడ్లు అన్నారు. సోమవారం కొహెడలో భూబాధితుల నిరసనకు మద్దతుగా మాట్లాడారు. సర్వే నంబర్ 167 బై 1లో భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం ఇవ్వకుండా, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకుండా పనులకు శంకుస్థాపన చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి, విధివిధానాలు ప్రకటించడంతో పాటు, నష్ట పరిహారం, అభివృద్ధి చేసిన లే అవుట్లో 600 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి, అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కాగా.. నిరసన, ర్యాలీ నేపథ్యంలో పోలీసులు మోహరించారు. బీజేపీ సీనియర్ నాయకులుపాపయ్యగౌడ్, సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ రాంరెడ్డి, నాయకులు నర్సింహా రెడ్డి, పురుషోత్తం, అనిల్, రైతులు కృష్ణ, రంగయ్య, మహేశ్,శివ ప్రసాద్ పాల్గొన్నారు.


