● సిద్దాపూర్లో డంపింగ్ యార్డు నిర్మిస్తే ఊరుకోం
● ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్
షాద్నగర్రూరల్: సామాజిక న్యాయమే పునాదిగా శ్రమజీవుల హక్కులను కాపాడే బహుజన రాజ్యాన్ని నిర్మించడమే లక్ష్యమని ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్ సమీపంలో ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ‘మేమెంతో–మాకంత వాటా’అనే నినాదంతో నిర్వహించిన బీసీ, ఎస్టీ, ఎస్సీ జేఏసీ బహిరంగ సభకు హాజరైన విశారదన్మహరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 70 ఏళ్లుగా దోపిడి, అణిచివేత ధోరణి కొనసాగుతోందన్నారు. అగ్రకులాల దోపిడి, దౌర్జన్యాన్ని అణిచివేసి పేదలు, కూలీలు బీసీ, ఎస్టీ, ఎస్సీలకు సామాజిక న్యాయాన్ని అందించమే లక్ష్యమన్నారు. సిద్దాపూర్లో డంపింగ్యార్డు నిర్మాణం విషయం ప్రజలను తీవ్ర భయాందోళనకు, ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే కాలుష్య రహిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు కలిగించే కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదిలేదని అన్నారు. ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడితే సహించేదిలేదని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే డంపింగ్ యార్డును నిర్మిస్తే చూస్తూ ఊరుకో అన్నారు. డంపింగ్యార్డు నిర్మాణ విషయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు.


