● ఇబ్బంది పడుతున్న ఉపాధి కూలీలు
● మధ్యాహ్నం వరకు పడిగాపులు
● ఫొటో క్యాప్చర్ తీసేయాలని విన్నపం
బొంరాస్పేట: ఉపాధిహామీ కూలీలకు ఫొటో క్యాప్చరింగ్ అవస్థలు తెచ్చిపెడుతోంది. రోజుకు రెండుసార్లు ఫొటో దిగాల్సి ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. నెట్వర్క్ సిగ్నల్ లేకపోవడం, యాప్ ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలతో కూలీలతో పాటు ఈజీఎస్ సిబ్బంది అవస్థ పడుతున్నారు. వారంలో సోమవారం నుంచి శనివారం వరకు కొనసాగే ఉపాధి పనుల్లో.. ఈసారి ఉపాధి పనులకు వెళ్లే కూలీలు పని ప్రారంభంలో ఫొటో దిగాలి. కానీ సాంకేతిక సమస్యలతో సతమతమవుతున్నారు.
నిత్యం సమస్యే
ఫొటో క్యాప్చరింగ్లో నెట్వర్క్ సమస్యలు నిత్యం ఏదో ఒక ఊరిలో తలెత్తుతోంది. గురువారం నెట్ వర్క్ సమస్యలు మరింత ఎక్కువ కావడంతో ఉపాధి కూలీలకు హాజరు అవస్థ తప్పలేదు. మధ్యాహ్నం వరకు పడిగాపులు కాశారు. ఎందుకిలా జరుగుతోందో తెలియడం లేదని క్షేత్ర సహాయకులు, మేటీలు చెబుతున్నారు. దీనిపై ఈజీఎస్ సిబ్బంది, అధికారులు దృష్టిసారించి సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.


