ఆభరణాల కోసం మహిళ దారుణహత్య
చేవెళ్ల: ఆభరణాల కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని ఈర్లపల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొల్లపల్లి అనుబంధ గ్రామమైన ధర్మసాగర్కు చెందిన ఎరుకుల మైసమ్మ(48)కు ముప్పై ఏళ్ల కిందట వివాహమైంది. అనంతరం కొన్నేళ్లకు ఆమె భర్త చనిపోయాడు. దీంతో కొడుకు సురేశ్తో కలిసి ఆమె ధర్మసాగర్లోనే ఉంటుంది. కొడుకుకి వివాహం కావటంతో వేర్వేరుగా ఉంటున్నారు. మైసమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంది. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. బుధవారం మధ్యాహ్నం ఈర్లపల్లి సమీపంలో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించి మైసమ్మగా నిర్ధారించారు. దుండగులు ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోని తీసుకెళ్లి గొంతు కోసి రెండు కాళ్లను నరికి 50 తులాల కడియాలు, చెవి కమ్మలు దోచుకెళ్లారు. తాగిన మైకంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ భూపాల్శ్రీధర్ తెలిపారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
రాజేంద్రనగర్ : పోక్సో కేసులో రాజేంద్రనగర్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ న్యాయమూర్తి నిందితునికి 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపిన మేరకు.. 2020 అక్టోబరు 23న ఉప్పరపల్లి సన్ రైస్ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలిక ఇంటిముందు ఆడుకుంటూ ఉంది. బండ్లగూడ గౌస్ నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ యూసుఫ్ (46)తన ఆటోను ఆ ప్రాంతంలో పార్కు చేశాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి ఆటోలో లైంగికదాడికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. నేరం రుజువుకావడంతో బుధవారం న్యాయమూర్తి శ్రీనివాస్ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.మూడు లక్షలు చెల్లించాలని ఆదేశించారు.


