మంచాల: అక్రమ నిర్మాణాలను నిరోధించడంలో విఫలమైన పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధులకు జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా స్థానిక పంచాయతీ కార్యదర్శిని బదిలీ చేశారు. వివరాలివీ.. నోముల పంచాయతీ పరిధి శ్రీ మల్లికార్జునగూడ రెవెన్యూ పరిధిలోని 33 సర్వే నంబర్లో అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నారు. వీటిని అడ్డుకోవడంలో అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారు. దీంతో కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు డీపీఓ సురేష్ మోహన్ చర్యలకు ఉపక్రమించారు. పంచాయతీ కార్యదర్శి సుభద్రదేవిని మహేశ్వరం మండలం పడమటి తండాకు బదిలీ చేశారు. అక్రమ నిర్మాణాల విషయంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ కోరుతూ పంచాయతీ కార్యదర్శితోపాటు సర్పంచ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.


