ఇబ్రహీంపట్నం: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన శనివారం ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ సూర్యతేజ తెలిపిన వివరాల ప్రకారం.. మంగల్పల్లి నుంచి కొహెడ వెళ్లే రోడ్డులో దర్గా వద్ద ఓ వ్యక్తి మృతదేహం పడి ఉందని డయల్ 100కు కాల్ వచ్చింది. వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పల్సర్ బైక్, పర్సు, ఫోన్ అక్కడ లభించాయి. మొబైల్ నంబర్ ఆధారంగా మృతుడి బంధువులకు సమాచారం చేర వేశారు. మృతుడిని హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన మహమ్మద్ అలీ(40)గా గుర్తించారు. కొహెడ వద్ద దర్గాలో ప్రార్థన చేసి వస్తానని శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన అలీ రాత్రి 8 గంటలకు ఫోన్లో కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మృతుడి ముక్కు నుంచి రక్తం కారుతూ, శరీరం బిగిసుకుపోయి ఉందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. కాగా అలీకి ఆరోగ్య సమస్యలున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.


