మర్పల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని మొగిలిగుండ్ల వెంచర్లో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు, ఎస్ఐ ఎండీ రవూఫ్ తెలిపిన ప్రకారం.. బొంరాస్పేట మండలం బురాన్పూర్ గ్రామానికి చెందిన మంగళి నర్మద అలియాస్ తులసి(27)కి 2018లో బంట్వారం మండల కేంద్రానికి చెందిన రవీందర్తో వివాహమైంది. వీరికి ఆరేళ్ల కుమారుడు, ఐదేళ్ల బాలిక సంతానం. రెండేళ్లుగా రవీందర్ తరచూ మద్యం సేవించి భార్యను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు నర్మద పుట్టింకి వెళ్లగా సర్ధిచెప్పి పంపించారు. ఇటీవల మొగిలిగుండ్ల గ్రామం సమీపంలోని ఓ వెంచర్లో రవీందర్ దంపతులు, బంధువులు పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 7వ తేదీన రవీందర్ మద్యం సేవించి వెంచర్లోనే నర్మదను విచక్షణ రహితంగా కొట్టాడు. దీంతో ఆమె అనారోగ్యం పాలైంది. రెండు రోజులుగా అన్నం తినడం మానేసింది. పరిస్థితిని గమనించిన బంధువులు శనివారం రాత్రి మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె అప్ప టికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆదివారం మృతురాలు చెల్లెలు శశి తన సోదరిని చిత్రహింసలు పె ట్టి సకాలంలో వైద్యం అందించకపోవడంతోనే మృతి చెందిందని రవీందర్పై చట్ట రీత్యా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.


