చేవెళ్ల: ప్రమాదవశా త్తు బావిలో పడిన రైతు మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల ఠాణా పరిధిలోని చనువెళ్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు పట్లన్నగారి రఘువీర్ రెడ్డి(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం సాయంత్రం తన వ్యవసాయ పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయాడు. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. రాత్రి పొలానికి వెళ్లి పరిశీలించినా చీకటి పడడంతో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఉదయం పొలానికి వెళ్లిన కుటుంబసభ్యులకు పొలం వద్ద చెప్పులు. సెల్ఫోన్ బావి వద్ద కనిపించటంతో అనుమానం వచ్చి బావిలో పరిశీలించారు. ఈత రాకపోవటంతో బావిలో నీళ్లకోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య సుకన్య ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంసభ్యులకు అప్పగించారు.


