ఆమనగల్లు: దేశంలోని హిందూ సమాజమంతా ఐక్యంగా ఉండాలని శ్రీగిరి అష్టలక్ష్మీ క్షేత్రం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య కృష్ణానందస్వామి పిలుపునిచ్చారు. యువత ధర్మం, సంప్రదాయాలను కాపాడాలని కోరారు. ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పట్టణంలోని ఓ ఫంక్షన్హాలులో శనివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక విశ్రాంత ఉపాధ్యాయుడు సుధీర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కృష్ణానందస్వామి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, తెలంగాణ ప్రాంత ధర్మ జాగరణ నిధి ప్రముఖ్ ఎడుదొడ్ల శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణానందస్వామి మాట్లాడుతూ.. దేశానికి ఆత్మ, ప్రాణం హిందూ ధర్మమని అన్నారు. హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైఖ్యపరిచి దేశాన్ని విశ్వగురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు పాపిశెట్టి రాము, ఎర్రవోలు మహేశ్, వెంకటయ్య, మహిళా రాష్ట్ర సేవికా సమితి నాగశ్రీ, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు చుక్క ఆనంద్, అంజయ్య, దొంతు విశ్వనాథం, సత్యం, యాదిరెడ్డి, మాజీ కౌన్సిలర్ చెక్కల లక్ష్మణ్, నాయకులు చుక్కా అల్లాజీగౌడ్, మంచని రాజు, ఆనంద్, మాధవాచారి తదితరులు పాల్గొన్నారు.


