కొడంగల్: పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.110 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం ప్రత్యేక కార్యదర్శి శ్రీనివాస రాజు తెలిపారు. గురువారం కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఆలయాన్ని సందర్శించారు. బాలాలయంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ ధర్మకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ విస్తరణ పనులను పరిశీలించి వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పునర్నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. రెండేళ్ల లోపు పనుల పూర్తికి కృషి చేయాలన్నారు. సంప్రదాయ నిర్మాణ శైలిని కాపాడుతూ నాణ్యతా ప్రమాణాలకు పాటించాలని ఆదేశించారు. అనంతరం కడా కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమష్టిగా పనిచేసి ఆలయాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాఢ వీధులు, క్యూలైన్, కల్యాణ మంటపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లకు నూతన భవనాలు నిర్మించనున్నట్లు చెప్పారు. పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ కల్చర్ నర్సింహారెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ రాజేశ్వర్రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ సీఈ చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సొంతింటి కలను సాకారం చేసుకోవాలి
కొడంగల్ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని సీఎం స్పెషల్ సెక్రటరీ శ్రీనివాస్రాజు అన్నారు. గురువారం పట్టణంలో పర్యటించిన ఆయన అనూష, బస్వరాజ్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బత్తుల అనిత నర్సింహ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
సన్మానం
కొడంగల్ పర్యటనలో ఉన్న సీఎం ప్రత్యేక కార్యదర్శి శ్రీనివాస్ రాజును గురువారం ధూపదీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థాచారి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.


