షాద్నగర్రూరల్: వ్యవసాయ పొలం వద్ద ఒంటరిగా ఉన్న మహిళ మెడపై నుంచి గుర్తు తెలియని వ్యక్తి పుస్తెలతాడును దొంగిలించిన సంఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సీతారాం కథనం ప్రకారం.. కొండన్నగూడ గ్రామానికి చెందిన వీరమ్మ గురువారం తమ వ్యవసాయ పొలంలో పశువులను మేపి పాకలో కట్టేసింది. కుటుంబ సభ్యులు శుభకార్యానికి వెళ్లడంతో మధ్యాహ్నం పొలంలోని చెట్టు నీడలో కూర్చుంది. ఆమె ఒంటరిగా కూర్చున్న విషయాన్ని గమనించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి తన ద్విచక్రవాహనాన్ని కొద్ది దూరంలో నిలిపి వెనుకనుంచి వచ్చి వీరమ్మ మెడలోనుంచి నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యాడు. సమాచారాన్ని తెలుసుకున్న ఏసీపీ లక్ష్మినారాయణ, పట్టణ సీఐ సీతారాం, డిటెక్టివ్ ఎస్ఐ శివారెడ్డితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరమ్మను అడిగి వివరాలను తెలుసుకొని ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడి కోసం మూడు పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సీఐ సీతారాం తెలిపారు.


