● రికార్డు స్థాయిలో పెరిగిన విద్యుత్ వినియోగం
● ఒత్తిడికి గురవుతున్న సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు
● సరఫరాలో తప్పని అంతరాయం
● ఆర్టిజన్ల సమ్మైపె ఎస్మాస్త్రం సిద్ధం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధంతో ఏర్పడిన గ్యాస్ కొరత కారణంగా ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వినియోగం పెరిగింది. బయట ఎండలు భగ్గున మండుతుండటం.. ఇంట్లో ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు రోజంతా ఆన్లోనే ఉండటంతో గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే.. ప్రస్తుతం రోజుకు సగటున 300 మెగావాట్లకు పైగా అదనంగా రికార్డవుతోంది. యుద్ధం కారణంగా ఆయిల్, గ్యాస్ దిగుమతులు క్లిష్టం కావడంతో ఇప్పటికే ప్రభుత్వం వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు విధించింది. అప్పటి వరకు గ్యాస్పై ఆధారపడిన గృహాలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్లను వాడుతున్నారు. దీనికితోడు గ్రేటర్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం కరెంట్ డిమాండ్ తార స్థాయికి చేరుతోంది. దీంతో సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు(పీటీఆర్)లు, వీధుల్లోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్ లోడ్ పడుతోంది. ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో సరఫరాలో తరచూ అంతరాయాలు తలెత్తుతున్నాయి. ఓవర్లోడు వల్ల ఫ్యూజ్లు కొట్టేస్తుండటంతో స్పార్క్లు తలెత్తి డీటీఆర్ల కింద పేరుకుపోయిన చెత్తలో పడటంతో మంటలు వ్యాపించి డీటీఆర్లు పేలుతున్న ఘటనలు లేకపోలేదు.
విద్యుత్ వాహన విస్పోటనం
ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో 71,579, మేడ్చల్లో 56,873, రంగారెడ్డిలో 57,911 ఎలక్రిక్ వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. వీటిని కొనుగోలు చేసే గవర్నమెంట్ ఉద్యోగులకు పన్నులో పలు రాయితీలు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజారవాణాలో కీలకంగా ఉన్న ఆర్టీసీ కూడా విద్యుత్ వాహనాలనే ఎక్కువగా కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తోంది. వినియోగదారులు అభిరుచికి తగ్గట్లుగా వాహన తయారీ కంపెనీలు కూడా బ్యాటరీలకు లైఫ్టైమ్ గ్యారంటీ ఇస్తుండటంతో మెజార్టీ ఔత్సాహికులు చార్జింగ్ వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపడం విద్యుత్ డిమాండ్కు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులపై ఎస్మా ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ వాహనాలు ఇలా..
వాహనం హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి
ఆటోలు 2,931 441 629
ప్రైవేటు బస్సులు 18 11 22
ఈ రిక్షాలు 25 16 24
సరుకు రవాణా 1,929 1,386 1,314
మోటారు క్యాబ్స్ 1,227 870 2,077
మోటార్ కార్లు 8,955 8,305 10,784
మోటార్ సైకిళ్లు 56,082 45,843 42,985
ప్రైవేటు సర్వీసు వెహికిల్స్ 03 01 33
స్టేజ్ క్యారేజీలు 409 – 43
తేదీ 2025(మెగావాట్లు) 2026
01 3,563 3,919
02 3,574 3,867
03 3,523 3,866
04 3,469 3,826
05 3,202 3,517
06 3,753 3,944
07 3,768 3,933


