ఇబ్రహీంపట్నం రూరల్: రోడ్డు భద్రతపై చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉందని, వాటిని నివారించడానికి అందరూ కృషి చేయాలని సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి అధికారులను ఆదేశించారు. 99రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో రోడ్డు భద్రత కమిటీ సమావేశాలను నిర్వహించి, వారాంతర అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఇందులో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేసి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీఆర్ఓ సంగీత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, రోడ్డు భద్రతా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


