లేబర్ల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

లేబర్ల సమస్యల పరిష్కారానికి కృషి

Apr 9 2026 9:23 AM | Updated on Apr 9 2026 9:23 AM

లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ శంషాబాద్‌ డివిజన్‌ ఏఎల్‌ఓ వాల్యానాయక్‌

మొయినాబాద్‌రూరల్‌: కార్మికులకు సంక్షేమ పథకాలు అందేందుకు కృషి చేస్తానని లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ శంషాబాద్‌ డివిజన్‌ ఏఎల్‌ఓ బి.వాల్యానాయక్‌ అన్నారు. బుధవారం కాంగ్రెస్‌ చేవెళ్ల నియోజకవర్గ లేబర్‌సెల్‌ ప్రధాన కార్యదర్శి తోల్‌కట్ట శివశంకర్‌గౌడ్‌, లేబర్‌ సెల్‌ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జ్యోతితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శివశంకర్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. భవన, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి 1996లో చట్టం పరిధిలోని లబ్ధిదారులకు సంక్షేమ మండలి నుంచి లబ్ధి చేకూరేలా చూడాలని కోరారు. శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ.5లక్షలు, పాక్షిక అంగవైక్యల్యం కలిగిన వారికి రూ.4లక్షలు ఆర్థికసాయం అందేలా చూడాలని కోరారు. అనంతరం ఏఎల్‌ఓ బి.వాల్యానాయక్‌ మాట్లాడుతూ.. కార్మికులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఆయనను కలిసిన వారిలో లేబర్‌ సెల్‌ షాబాద్‌ అధ్యక్షుడు ముక్కు రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

గో సంరక్షుడిపై దాడి

మీర్‌పేట: గోవుల అక్రమ రవాణాన్ని అడ్డుకునేందుకు యత్నించిన యువకుడిపై దాడికి పాల్పడిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బుధవారం ఉదయం యాచారం నుంచి బొలేరో వాహనంలో ఆరు గోవులను నగరానికి తరలిస్తున్నారు. దీని వెనుక రక్షణగా మరో కారు ప్రయాణిస్తోంది. ఇది గమనించిన గడ్డమల్లయ్యగూడ గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్‌ (24) బైక్‌పై వెంబడించాడు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధి మందమల్లమ్మ వద్దకు రాగానే ప్రేమ్‌కుమార్‌ బైక్‌ను వాహనానికి అడ్డు పెట్టగా, వెంటనే వెనుక కారులో నుంచి కొందరు వ్యక్తులు దిగి అతడిపై దాడి చేసి పారిపోయారు. ప్రేమ్‌కుమార్‌ స్థానికుల సాయంతో ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్‌, ఇతర నాయకులు మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి గో సంరక్షకుడిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేసి శిక్షించాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేసు నమోదు చేశామని, దాడికి పాల్పడ్డ గుర్తు తెలియని వ్యక్తులను అరెస్ట్‌ చేస్తామని ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌నాయక్‌ తెలిపారు.

తండాల అభివృద్ధికి కృషి

తాండూరు రూరల్‌: నియోజకవర్గ పరిధి గిరిజన తండాలకు బీటీరోడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దేముల్‌, తాండూరు మండలంలో ట్రైబల్‌ ఎస్‌డీఎఫ్‌ నిధులు రూ.6.10 కోట్లతో బీటీరోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ– కర్ణాటక సరిహద్దు తాండూరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పెద్దేముల్‌ మండలం బుద్దారం నుంచి పెద్దేముల్‌తండాకు, బాయిమీదితండా నుంచి షాదిపూర్‌నకు లింకురోడ్లు వేస్తున్నామని తెలిపారు. అలాగే తాండూరు మండలం రాంపూర్‌మీదితండా నుంచి రాంపూర్‌కిందితండా, రాంపూర్‌ వరకు బీటీరోడ్డు వేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement