ధాన్యం సేకరణ సజావుగా సాగాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణ సజావుగా సాగాలి

Apr 8 2026 8:08 AM | Updated on Apr 8 2026 8:08 AM

అనంతగిరి: వరి ధాన్యం సేకరణ సజావుగా, పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్‌ దీపక్‌ తివారీ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో యాసంగి సీజన్‌ 2025 – 26కు సంబంధించి ధాన్యం సేకరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. క్వింటాలు ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర ఇవ్వనున్నట్లు తెలిపారు. సన్న రకం వడ్లకు రూ.500ల బోనస్‌ వస్తుందన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. విద్యుత్‌ సరఫరా ఉండేలా చూసుకోవాలన్నారు. రైతులకు టోకెన్లు ఇచ్చి.. తేమ 17 శాతం కంటే తక్కువ ఉంటే సేకరించాలన్నారు. సరిపడా టార్పాలిన్లు, తూకం, తేమ, తూర్పార యంత్రాలు, గోనె సంచులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు వాహనాలను సమకూర్చుకోవాలన్నారు. ఫిర్యాదుల కోసం హెల్ప్‌ లైన్‌ను ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ రాజేశ్వరి, డీఆర్డీఓ శ్రీనివాస్‌, డీఎంసీఎస్‌ మోహన్‌ కృష్ణ, డీసీఎస్‌ఓ సుదర్శన్‌, నాగార్జున, డీఏఓ రాజరత్నం, డీసీఎంఎస్‌ బిజినెస్‌ మేనేజర్‌ శ్యామ్‌ రెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి మహ్మద్‌ రియాజ్‌, అదనపు డీఆర్‌ఓ నర్సింలు, డీపీఎం కొమురయ్య, మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు బాలేశ్వర్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

వేగవంతంగా చేయాలి

జెడ్పీ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి ఆదేశించారు. మంగళవారం వికారాబాద్‌లో భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు ఉండాలి

కలెక్టర్‌ దీపక్‌ తివారీ

Advertisement
 
Advertisement
Advertisement