‘గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు. అవి అభివృద్ధి సాధిస్తేనే దేశ ప్రగతి సాధ్యం’ అన్న మహాత్ముడి మాటలకు.. ప్రస్తుతం చోటు లేకుండా పోయింది. అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా.. పంచాయతీల్లో కనీసం సచివాలయాలు లేక బడి, గుడి ఆవరణలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
బషీరాబాద్: గ్రామ పంచాయతీలకు సొంత గూడు కరువైంది. పల్లెలో అభివృద్ధి సాధ్యమని భావించిన గత ప్రభుత్వం 2018, నేటి కాంగ్రెస్ సర్కార్.. 23 అనుబంధ గ్రామాలకు పంచాయతీగా హోదా కల్పించింది. జీపీలుగా గుర్తించి ఏళ్లు గడుస్తున్నా.. పాలకవర్గాలకు సొంత భవనాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కొత్త భవనాలు సమకూర్చాల్సిన ప్రభుత్వాలు తాత్సారం చేయడంతో ఉన్న కొన్ని సచివాలయాలు శిథిలా వస్థకు చేరగా, చాలా జీపీలు అంగన్వాడీలు, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
ఇరుకు గదుల్లో..
బషీరాబాద్ మండలంలో 39 పంచాయతీలు ఉండగా.. వీటిలో 12 జీపీలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. అవి కూడా శిథిలావస్థకు చేరాయి. 27 గ్రామాల్లో పరిపాలన అద్దె భవనాల్లో కొనసాగుతోంది. ఒక్కో పంచాయతీలో సర్పంచ్తో పాటు 10 నుంచి 15మంది వార్డు సభ్యులు ఉంటారు. అలాగే కార్యదర్శి, కో ఆప్షన్, ఏఎన్ఎం, ఫీల్డ్ అసిస్టెంట్తో కలిపి 20మంది వరకు సమావేశానికి హాజరుకాగా.. ఇరుకు గదుల్లో విధులు నిర్వహించడం సర్పంచులకు తలనొప్పిగా మారింది. కొన్ని పంచాయతీల్లో గుడి, బడుల ఆవరణలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి కొన్ని జీపీల్లో అద్దె ఇళ్లు దిక్కయ్యాయి. ఇస్మాయిల్పూర్, జలాల్పూర్, పర్వత్పల్లి, మర్పల్లి, బాబునాయక్తండా, ఇందర్చెడ్, క్యాద్గీరా, మాసన్పల్లి, కొత్లాపూర్, వాల్యానాయక్తండా, గొట్టిగఖుర్ధు గ్రామాల్లో కొత్త భవనాలు ఉపాధిహామీ పథకం కింద మంజూరయ్యాయి. ఒకటి రెండు మినహాయిస్తే మిగతా గ్రామాల్లో నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది.
27 పంచాయతీలకు భవనాల కొరత
కొత్త నిర్మాణాలకు గ్రహణం
శిథిలావస్థలో పాత కార్యాలయాలు
అద్దె ఇళ్లలో వసతులు కరువు
గుడి, బడుల ఆవరణలో సమావేశాలు


