ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీహరి
తాండూరు రూరల్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొప్పి శ్రీహరి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాండూరు మండలం వీర్శెట్టిపల్లిలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్లో కేవలం రెండు ఎంపీ సీట్లతో ప్రారంభమైన బీజేపీ నేడు దేశంలో అతి పెద్ద పార్టీగా అవతరించిందన్నారు. దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ జర్నప్ప, నాయకులు తూర్పు శ్రీహరి, ఎర్ర శ్రీనివాస్, పరశురాం, నర్సింలు, హరీశ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాణం తీసిన ఈత సరదా
● నీట మునిగి బాలుడి మృతి
● చౌడాపూర్ మండలంలో ఘటన
కుల్కచర్ల: ఈత కోసం వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన చౌడాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్మన్కాల్వ గ్రామానికి చెందిన నవాజ్ పాషా కుమారుడు శంషీర్(9), మరి కొందరు సోమవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని బావిలో కొందరు ఈత కొట్టడానికి వెళ్లారు. శంషీర్ ఈత రాకున్నా బావిలోకి దిగాడు. నీట మునిగి అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబీకుల అక్కడికి చేరుకొని బోరున విలపించారు. శంషీర్ స్థానికంగా 4వ తరగతి చదువుతున్నాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
బైక్ అదుపుతప్పి, ముగ్గురికి గాయాలు
దుద్యాల్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి, ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన మండల పరిధి హకీంపేట్లో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కుల్కచర్ల మండల కామన్పల్లి గ్రామానికి చెందిన ఒగ్గుడోలు కళాకారులు కృష్ణయ్య, మల్లయ్య, అంజిలయ్యలు హకీంపేట్లో కార్యక్రమం ముగించుకొని, తిరిగి వెళ్తున్న క్రమంలో వారు బైక్ కింద పడింది. దీంతో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు కొందరు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని కుటుంబీకులు వేరు ప్రాంతాలకు తీసుకెళ్లారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేయకుండా వదిలేయడంతోనే ప్రమాదం జరిగిందని, అధికారులు స్పందించి సీసీరోడ్డు పనులు పూర్తి చేయించాలని కోరారు.
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
మోమిన్పేట: ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మోమిన్పేటలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్ భూషణ్ తెలిపిన ప్రకారం.. మర్పల్లి మండలం కోట మర్పల్లి గ్రామానికి చెందిన కావలి శేఖర్(38), ఆదే గ్రామానికి చెందిన సంజీవులు వద్ద గడ్డి కోసే పనికి కుదిరాడు. సోమవారం మోమిన్పేట మండల పరిధి ఏన్కతల గ్రామ శివారు ఓ వెంచర్లో గడ్డి కోసేందుకు ఇద్దరు వెళ్లారు. ఈ క్రమంలో వెంచర్లోని రోడ్డుపై శేఖర్ నడుస్తుండగా వెనుక నుంచి ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ రాజశేఖర్ మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కాగా.. మృతుడికి భార్య యాదమ్మ, కూతురు కావేరి, కుమారుడు విష్ణు ఉన్నాడు. యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.


