తుర్కయంజాల్: మితిమీరిన వేగంతో వస్తున్న ఓ కారు అదుపు తప్పి పల్టీ కొట్టిన సంఘటన శుక్రవారం సాయంత్రం ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధి రాగన్నగూడ సాగర్ హైవేపై చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో కారును సైతం ఢీకొట్టడంతో రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓఆర్ఆర్ నుంచి తుర్కయంజాల్ వైపునకు ఓ కారు వస్తుంది. మార్గమధ్యలో సబ్స్టేషన్ సమీపంలోకి వచ్చాక యూటర్న్ వద్ద వేగాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా అకస్మాత్తుగా హ్యాండ్ బ్రేక్ వేయడంతో పల్టీ కొట్టడంతో పాటు ముందుగా వెళ్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఈ క్రమంలో డివైడర్ పైన ఉన్న మొక్కలు, ప్రకటన బోర్డును సైతం ధ్వంసం చేసి అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఇదిలా ఉండగా రెండు కార్లలో చిన్న పిల్లలతో కలిసి మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నారు. అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
భారీగా ట్రాఫిక్ జాం
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించినప్పటికీ సీఎం రేవంత్రెడ్డి పర్యటన బందోబస్తు ఉండడంతో ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో సాగర్ రహదారిపై రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు కారును పక్కకు జరిపించి, వాహనాల రద్దీని క్లియర్ చేశారు. దీంతో గంట పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.


