● ప్రజా సమస్యలు ఉన్నన్ని రోజులు ఎర్రజెండా ఉంటుంది
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
● దివంగత ఎమ్మెల్యే కొండిగారి రాములుకు ఘన నివాళి
ఇబ్రహీంపట్నం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. స్థానిక భారత్ గార్డెన్లో మంగళవారం ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు సంతాపసభ నిర్వహించారు. నివాళులర్పించిన అనంతరం కూనంనేని మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. పేద ప్రజల కోసం తీసుకొచ్చిన ప్రతీ చట్టం వెనక కమ్యూనిస్టుల పాత్రం ఉందన్నారు. మే డే రోజు పీఎం అయినా సీఎం అయినా ఎర్రజెండానే ఎగురవేయాన్నారు. కమ్యూనిస్టులను అణిచివేయాలని ఆనాడు హిట్లర్ చూస్తే.. నేడు కేంద్రంలోని అమితాషా చూస్తున్నాడని ఆరోపించారు. మావోయిస్టులను తాత్కాలికంగా అమితాషా అణిచివేయవచ్చు.. కానీ కమ్యూనిస్టులను అణిచివేయలేడన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటేనే కమ్యూనిస్టులు ఉన్నట్లు కాదని.. ప్రజా సమస్యలు ఉన్నన్ని రోజులు వాటి పరిష్కారానికి పోరాడేందుకు కామ్రేడ్లు ఉంటారని స్పష్టంచేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కమ్యూనిజమే శాశ్వతమని, కమ్యూనిస్టులు లేని సమాజామాన్ని ఊహించలేమని తెలిపారు. పేదరిక నిర్మూలనే అసలైన ప్రజాపాలన అన్నారు. పేదవారిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలకు సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ చేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి సీపీఐ చేరాలన్నారు. నిస్వార్థ ప్రజా సేవకుడు మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాములు సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.హేమంతరావు, రవీంద్రచారి, జిల్లా కార్యదర్శి జంగయ్య, కావలి నర్సింహ్మ, ముత్యాల యాదగిరిరెడ్డి, ప్రభులింగం, ఓరుగంటి యాదయ్య, రామస్వామి, సురేష్, శివరాల లక్ష్మయ్య, నీలమ్మ, సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


