యాచారం: సంపూర్ణ అక్షరాస్యతతోనే రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకునే అవకాశం ఉంటుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మండల పరిధిలోని చౌదర్పల్లిలో ఆదివారం అంబేడ్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం పేదలకు ఎన్నో అవకాశాలను కల్పించిందని, కానీ అక్షరాస్యత లేకపోవడంతో అన్యాయాలపై ప్రశ్నించే అవకాశం లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా విద్యనందించే ఎన్నో విద్యాలయాలు ఏర్పాటు చేసిందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని సూచించారు. అంబేడ్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు జేబీ రాజు మాట్లాడుతూ.. రాజ్యాంగ ఫలాలు దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అంతకు ముందు మాల్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద లింగం కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో అంబేడ్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాల దాత జుట్టు శ్రీశైలం, చౌదర్పల్లి సర్పంచ్ రాజుగౌడ్, వివిధ పార్టీల నాయకులు బిలకంటి చంద్రశేఖర్రెడ్డి, నవీన్రెడ్డి, నడుకుడి కృష్ణ, ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కొండ్రు యాదగిరి మృతి తీరని లోటు
ఇబ్రహీంపట్నం రూరల్: మాదిగ ఉద్యమానికి కొండ్రు యాదగిరి లేని లోటు తీరనిదని మందకృష్ణ మాదిగ అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన కొండ్రు యాదగిరి మూడు రోజుల క్రితం మృతి చెందాడు. మరణవార్త తెలుసుకున్న మంద కృష్ణమాదిగ ఆదివారం ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లారు. యాదగిరి చిత్రపటానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట నాయకులు జుట్టు సతీష్, మంద సుధాకర్, రమేష్, గణేశ్, అయోధ్య, అంజయ్య తదితరులు ఉన్నారు.
మహనీయుల విగ్రహాలు ఆవిష్కరణ
కొందుర్గు: మండలంలోని పర్వతాపూర్లో మహా త్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఆదివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆవిష్కరించారు. విగ్రహాల దాతలు ప్రభావతి, భీమయ్య దంపతులను సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహోన్నత వ్యక్తులను గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బోయ అశోక్, అంబేడ్కర్ యువజన సంఘం సభ్యుడు రాధాకృష్ణ, నాయకులు అందె బాబయ్య, కృష్ణారెడ్డి, కృష్ణ, సుందర్, జగన్, మంగులాల్నాయక్, బల్వంత్ రెడ్డి, మల్లేష్ గౌడ్, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ


