ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లాలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో శనివారం సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్యాస్ సరఫరాకు ఎలాంటి కొరత లేదని, తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వినియోగదారులు ఆందోళనకు గురికాకుండా అవసరం మేరకు సమయానికి గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అవసరం లేకుండా బుకింగ్ చేయడం ద్వారా సరఫరా వ్యవస్థపై ఒత్తిడి ఏర్పడుతుందన్నారు. బుకింగ్ చేసిన తర్వాత సంబంధిత ఏజెన్సీలు వినియోగదారుల ఇళ్ల వద్దకే సిలిండర్ సరఫరా చేస్తాయని తెలిపారు. ఎవరూ కూడా ఏజెన్సీలు, గోదాముల వద్దకు వెళ్లొద్దన్నారు. బంకుల వద్ద బారులు తీరి కొరత ఉందని సమస్యలు సృష్టించొద్దని, అధిక మోతాదులో తీసుకొని ఇళ్లలో నిల్వ చేసుకోవద్దని తెలిపారు. సరఫరాపై ఏజెన్సీలు, బంకుల యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, సివిల్ సప్లై శాఖ అధికారి వనజాత, సంక్షేమ శాఖ అధికారులు రామేశ్వరిదేవి, కేశురాం, వ్యవసాయ శాఖ అధికారి ఉష తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి


