బిల్డర్లకు అండగా ఉంటాం
పహాడీషరీఫ్: బిల్డర్లు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. బిల్డర్స్ డే ను పురస్కరించుకొని మామిడిపల్లిలోని పద్మజా పామ్ గ్రోవ్స్లో ఏర్పాటు చేసిన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 4వ నేషనల్ మేనేజింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ సమావేశాలను శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఎదుర్కొనే సవాళ్లు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉన్న ‘బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ కాంట్రాక్టర్లు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తోందని కొనియాడారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన డాక్టర్ మాధవీలత, ఎ.నరేందర్రెడ్డి, బొల్లినేని శీనయ్య, డి.సుధాకర్రెడ్డి, జానపద గాయకుడు నల్గొండ గద్దర్కు అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు రాజేంద్రసింగ్ కాంబో, ఐఎఫ్ఏడబ్ల్యూపీసీఏ బోర్డు మెంబర్ ఎస్ఎన్ రెడ్డి, బీఏఐ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణారావు, బీఏఐ మాజీ చైర్మన్ బి.సీనయ్య తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి


