ఉపాధ్యాయ సమస్యలపై పోరాడుతాం
మంచాల: రాష్ట్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాడుతామని తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య స్పష్టం చేశారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అమలు చేసే విధానంలో స్పష్టత ఇవ్వాలన్నారు. పీఆర్సీ అమలు చేసిన తరువాతే ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ స్వీకరించాలని, అప్పటి వరకు ప్రభుత్వమే భరించాలన్నారు. మోడల్ స్కూల్, గురుకుల, కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందికి సైతం హెల్త్ కార్డులు వర్తింప చేయాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని, పదో తరగతి పరీక్ష విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్ల రెమ్యునరేషన్ పెంచాలని, స్పాట్లో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోట్ల కాశీరావు, పూజరి రమేష్, రాష్ట్ర మీడియా కో–కన్వీనర్ సత్తారి రాజిరెడ్డి, జిల్లా బాధ్యులు జిల్కపల్లి కరుణాకర్రెడ్డి, పట్నం కృష్ణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు రావుల శివకుమార్, దత్తాత్రేయ, చీర బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య


