కరివేపాకు సెంచరీ
గౌలిపురా: కరివేపాకు దూకుడు మీదుంది. నగర మార్కెట్లలో కిలో కరివేపాకు రూ.100–120 వరకు పలుకుతోంది. చిన్న కట్ట కావాలన్నా రూ.10 పెట్టాల్సిందే. రెండు నెలల క్రితం కిలో ధర రూ.50–60 ఉండగా.. ప్రస్తుతం రెండింతలైంది. చలి కారణంగా ఆకులు రాలిపోవడంతో నగరానికి దిగుమతి భారీగా తగ్గిపోయింది. అరకొరగా వచ్చే దిగుమతులతో ధరలకు రెక్కలొచ్చాయి. గుడిమల్కాపూర్, మాదన్నపేట్, బోయిన్పల్లి, మీరాలంమండి, శంషాబాద్ తదితర హోల్సేల్ మార్కెట్లలో కిలో రూ.80–100 వరకు పలుకుతుండగా.. వారాంతపు సంతలు, ఇతర లోకల్ మార్కెట్లలో కిలో రూ.100–120 ధర పలుకుతోంది. మరో నెల రోజుల్లో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


