పాల కేంద్రం ముసుగులో కల్తీ దందా
● ప్రమాదకర రసాయనాలతో
పాల తయారీ
● వ్యాపారి అరెస్ట్
కడ్తాల్: ప్రమాదకర రసాయనాలతో కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యాపారి గుట్టురట్టయింది. సీఐ గంగాధర్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన ఆనగోని శ్రీశైలం పాలకేంద్రం ఏర్పాటు చేసి రైతుల నుంచి పాలు సేకరిస్తున్నాడు. వ్యాపారం ముసుగులో కొంతకాలంగా కృత్రిమంగా కల్తీపాలు తయారు చేసి ప్రైవేట్ డెయిరీలకు విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా బుధవారం సాయంత్రం కల్తీ పాల తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కల్తీ పాల తయారీకి ఉపయోగిస్తున్న 45 డ్రైడ్ టీ కాఫీ క్రీమర్ ప్యాకెట్లు, 12 సాల్డ్ ప్యాకెట్లు, లూజ్ షుగర్, ఆరు క్యాన్లు (240 లీటర్లు) కల్తీ పాలు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాలకు తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలు షాద్నగర్లో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కల్తీ పాలతో పాటు వాహనాన్ని సీజ్ చేసి శ్రీశైలంను స్టేషన్కు తరలించారు. పాలను ల్యాబ్కు పంపిస్తామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
పాల కేంద్రం ముసుగులో కల్తీ దందా


