‘రైతు భరోసా’పై జాప్యం తగదు
అబ్దుల్లాపూర్మెట్: ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం తగదని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంతం మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్దఅంబర్పేట, కుంట్లూరు, పసుమాముల గ్రామాల్లో బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పెద్దఅంబర్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం కేబినేట్లో రైతు భరోసా ప్రకటన రాకపోవడంతో రైతులకు నిరాశ మిగిల్చిందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం రైతు భరోసా వాయిదా వేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి నల్లగొండ మీటింగ్లో రైతు భరోసా వేసేందుకు రూ.9వేల కోట్లు నిధులు సిద్ధం చేసామని.. మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన తెల్లారే రైతుల ఖాతాలో నిధులు జమచేస్తామని చెప్పిన మాట మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఎలాంటి శాటిలైట్ సర్వేతో సంబంధం లేకుండా, కొర్రీలు పెట్టకుండా సాగుభూములున్న రైతులకు భరోసా నిధులు తక్షణమే జమచేయాలని, లేదంటే పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు బి.విజయ్, జి.యాదగిరి, జె.నరేందర్, ఇ.రవి, బి.అశోక్, ముత్తయ్య, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి


