కుటుంబ కలహాలతో..
వ్యక్తి బలవన్మరణం
చేవెళ్ల: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన షాబాద్ ఠాణా పరిధి తిమ్మారెడ్డిగూడలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన మద్దూరి సత్తయ్య(46) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలో ఆయనకు వారసత్వంగా వచ్చిన భూమిలో వాటా కావాలంటూ ఆయన అక్కలు కేసు వేయడంతో కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయి. తన సోదరీమణులతో మాట్లాడి కొంత భూమి ఇచ్చేందుకు అంగీకరించాడు. కాగా ఆ భూమిలో కబ్జా ఇవ్వాలని కోరారు. దీంతో ఆయన భూమి తగాదాలో ఉందని.. సరిచేసి ఇస్తానని చెప్పాడు. ఉదయం ఇదే విషయమై భార్యాభర్తలు గొడవపడ్డారు. మనస్థాపం చెందిన సత్తయ్య ఇంటికి వెళ్లిపోయాడు. 11గంటల సమయంలో భోజనానికి రావలంటూ భార్య ఫోన్ చేయగా వస్తానని చెప్పి రాలేదు. పొలం వద్ద ఉన్న చెట్టుకు డ్రిప్ పైపులతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం అటుగా వెళ్లిన మేకల కాపరులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సావిత్రి, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


