ప్రజావాణి అర్జీలపై నిర్లక్ష్యం తగదు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణిలో వచ్చిన అర్జీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సత్వరమే పరిష్కరించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి ఆయన రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ కనబరచాలని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం కేవలం సమస్యలు విని దరఖాస్తులు స్వీకరించే విధంగా కాకుండా పరిష్కారాల వేదికగా నిలిచేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. ఈ వారం మొత్తం 43 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, మండల తహసీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.


