చిదిమేసిన కారుచీకట్లు
● కనిపించక ఎడ్లబండిని ఢీకొట్టిన బైక్
● ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
చేవెళ్ల: కారుచీకట్లు ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. అప్పటివరకు బంధువులతో సరదాగా గడిపి తమ ఇంటికి బయలు దేరిన వారు ఎడ్ల బండిని ఢీకొట్టారు. మండలంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో భర్త అక్కడిక్కడే మృతి చెందగా.. భార్య త్రీవ గాయాలతో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పూలెపల్లి గ్రామానికి చెందిన భాస్కర్(30) తన భార్య రాణి, నాలుగేళ్ల కూతురు శాన్వితతో కలిసి సోమవారం బైక్పై చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చారు. తిరిగి రాత్రికి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలోని తంగడపల్లి సమీపంలోకి రాగానే రోడ్డుపై ముందు వెళ్తున్న ఎడ్ల బండి కనిపించకపోవటంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో భాస్కర్ తల పగిలి అక్కడిక్కడే మృతి చెందారు. రాణి సైతం తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉంది. కూతురు స్వల్పగాయలతో బయటపడింది. గమనించిన స్థానికులు అంబులెన్స్లో క్షతగాత్రులను శంకర్పల్లిలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డిగ్రీ విద్యార్థిని అదృశ్యం
పహాడీషరీఫ్: కిరాణ దుకాణానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బి.ఎల్.ఎన్.రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ ప్రకాశం జిల్లాకు చెందిన మోచే కుటుంబం బతుకుదెరువు నిమిత్తం తుక్కుగూడ మంఖాలకు వలస వచ్చారు. ఇతని కుమార్తె సోని అలియాస్ రీత(19) గుంటూరు నర్సరావు పేటలో డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యనభ్యసిస్తూ అక్కడే హాస్టల్లో ఉంటుంది. ఈ నెల 20వ తేదీన మంఖాల్కు వచ్చిన రీత, 22వ తేదీన ఉదయం 11 గంటలకు స్థానికంగా ఉన్న కిరాణ దుకాణానికి వెళ్లొస్తానని బయటకి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ సైతం స్విచ్ఛాప్ చేయబడింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై ఆమె తల్లి జ్యోతి ఆదివారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రజక దంపతులపై దాడి హేయం
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక దంపతులపై దాడి చేయడమే కాకుండా రెండు నెలల చిన్నారి మృతికి కారకులైన గ్రామ పెద్దలు శ్రీనివాస్రెడ్డి, మాధవరెడ్డి, సతీష్రెడ్డిలపై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 14 బీసీ సంఘాల నాయకులతో కలిసి మాట్లాడారు. విచక్షణారహితంగా తన్నడంతో చిన్నారి మరణించిందని తెలిపారు. పోలీసు యంత్రాంగం బాధితుల పక్షాన నిలవకుండా వారిపైనే కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ హృదయ విదారక ఘటనను నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా బీసీలు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల బీసీలపై దాడులు పెరిగిపోయాయని, నల్లగొండ, నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్, గద్వాల్ జిల్లాల్లో బీసీలపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయని విచారం వ్యక్తం చేశారు. సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్కుమార్, నాయకులు నీల వెంకటేష్, జిల్లపల్లి అంజి, పగిళ్ల సతీష్, జి.అనంతయ్య, సి.రాజేందర్, గుజ్జ కృష్ణ, రాందేవ్, కృష్ణుడు, చంద్రశేఖర్ తదితర బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రజక కులస్తులపై దాడికి ఖండన
సాక్షి, సిటీబ్యూరో: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన జాతరలో రజక కులస్తులపై అగ్రవర్ణాలవారు దాడి చేయడాన్ని అఖిల భారత నవ యువ రజక సంఘం జాతీయ అధ్యక్షుడు ఓరేపల్లి హరికృష్ణ త్రీవంగా ఖండించారు. దర్శనం టికెట్ లేకుండా గుడిలోకి ప్రవేశించారనే నెపంతో రజక కులస్తులపై సర్పంచ్ ఆధ్వర్యంలో అగ్రవర్ణాలు దాడిచేయడంతో రెండు నెలల పాప చనిపోయిందని తెలిపారు. వెంటనే నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
గ్యాంగ్వార్లో గాయపడ్డ వ్యక్తి మృతి
మైలార్దేవ్పల్లి: గ్యాంగ్ వార్లో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మైలార్దేవ్పల్లి ఎస్ఐ షేక్ అబ్దుల్లా తెలిపారు. వివరాలు... బీకే పురానికి చెందిన ఆరీఫ్ శాసీ్త్రపురంలో ఉంటున్న గౌస్ వద్దకు ఓ వ్యక్తి ఈ నెల 17వ తేదీ రాత్రి స్నేహితుడు షర్దీన్ను తీసుకొని వచ్చాడు. వీరి మధ్య జరిగిన గొడవలు కాస్తా గ్యాంగ్ వార్గా మారింది. రెండు వర్గాలవారు అక్కడికి చేరుకొని పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ముజామిల్, రహాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ముజామిల్ ఆదివారం రాత్రి మృతి చెందాడు.
చిదిమేసిన కారుచీకట్లు


