వ్యర్థాలు పారబోసిన వాహనం సీజ్
పహాడీషరీఫ్: నగర శివారుగా ఉన్న జల్పల్లి సర్కిల్ పరిధిలో కొందరు అక్రమార్కులు కంపెనీల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను యథేచ్ఛగా పడేస్తూ ఈ ప్రాంతాన్ని అపరిశుభ్రంగా మారుస్తున్నారు. స్థానికంగా ఉన్న కంపెనీ నుంచి ఓ వ్యక్తి శనివారం పెద్ద ఎత్తున వ్యర్థాలను బొలెరో వ్యాన్లో తీసుకొచ్చి చెరువు ఒడ్డున పారబోస్తున్నాడు. ఈ సమయంలో అటుగా వచ్చిన మున్సిపల్ డ్రైవర్ సురేశ్ అడ్డుకున్నాడు. విషయం తెలుసుకున్న హైడ్రా అధికారులు, సర్కిల్ పారిశుద్ధ్య విభాగం సూపర్వైజర్ కుమార్లు వాహనాన్ని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని డిప్యూటీ కమిషనర్ బి.వెంకట్రామ్ సూచనతో హైడ్రా అధికారులు వాహనాన్ని సీజ్ చేశారు. సర్కిల్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో కంపెనీల వ్యర్థాలు, చెత్త వేసే వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.


