నిజాయతీ చాటుకున్న విద్యార్థి
దొరికిన బంగారు ఉంగరాన్ని ఉపాధ్యాయులకు అప్పగింత
యాచారం: ఓ విద్యార్థి తన నిజాయతీని చాటుకున్నాడు. తనకు పాఠశాల ఆవరణలో దొరికిన బంగారు ఉంగారాన్ని ఉపాధ్యాయులకు అందజేసి శభాష్ అనిపించుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని కుర్మిద్ద ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం వార్డు సభ్యురాలు సంతోషినిప్రియ సందర్శించే సమయంలో రూ.మూడు లక్షల విలువ జేసే బంగారు ఉంగరాన్ని పోగొట్టుకున్నారు. ఆ ఉంగరం అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న దండె విక్రమ్కు దొరికింది. అతడు ఉంగరాన్ని పాఠశాల హెచ్ఎం పాండురంగారెడ్డికి అందజేశారు. ఉంగరాన్ని పోగొట్టుకున్న వివరాలు ఆరా తీయగా వార్డు సభ్యురాలు సంతోషినిప్రియగా తేలింది. హెచ్ఎం పాండురంగారెడ్డి సంతోషినిప్రియకు సమాచారం ఇచ్చి ఉంగరాన్ని అందజేశారు. నిజాయతీగా ఉంగరాన్ని అందజేసిన విక్రమ్ను ఉపాధ్యాయులు, వార్డు సభ్యురాలు అభినందించి, సన్మానించారు.


