నాయకులు నారాజ్
● సర్వే అనుకూలంగా లేదని
టికెట్ల నిరాకరణ
● బీఫారం ఇవ్వకపోవడంతో గరం
● అధికార పార్టీలో పెరిగిన అసంతృప్తులు
పరిగి: పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటే ఉండి జెండా మోసి నిలబెట్టిన తమకే టికెట్(బీ ఫా రం) ఇవ్వడం లేదని అధికార పార్టీ చెందిన కొంతమంది నేతలు నారాజ్ అవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి రోజురోజుకూ అసంతృప్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల్లో అలకలు పెరిగినట్లు సమాచారం. అధికారంలో లేనప్పటి నుంచి అసల్ సిసల్గా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులను పక్కన పెట్టి కొందరికి టికెట్లను కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే అనుకూలంగా లేదని ఎన్నికల బరిలో ఉండరాదని ముక్కుసూటిగా చెప్పడంతో బీఫారం రాని నేతలు అయోమయస్థితిలో పడ్డారు. అధికార పార్టీ నుంచి ఎంతో మంది ఎన్నికల బరిలో నిలవాలని భావించినా కొందరికే ఆ అవకాశం దక్కనుంది. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఒకటి రెండు తప్పా ఎక్కడ రెబల్ బెడదా కనిపించడం లేదు.
నాలుగు వార్డుల్లో ప్రభావం
పరిగి మున్సిపల్లో 18 వార్డులున్నాయి. మొత్తం వార్డుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి 46 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి 30 సెట్ల నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి 31, స్వతంత్రులు 18 మొత్తంగా 158 నామినేషన్ సెట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. అధికార పార్టీలో అసంతృప్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రెండు నుంచి నాలుగు వార్డుల్లో సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. పార్టీ కోసం పనిచేస్తే ముఖంపైనే టికెట్ ఇచ్చేది లేదని చెప్పడంతో కొందరు నాయకులు నారాజ్ అవుతున్నారు. టికెట్లు ఆశించి రానివారు సొంత పార్టీలోనే ముసలం కానున్నారు. వారి నుంచి పార్టీకి పెద్ద దెబ్బపడనుందని చర్చించుకుంటున్నారు. అసంతృప్తులను గుర్తించి వారిని శాంతపరచకుంటే ఫలితాలు తారుమారు అయ్యే ఛాన్స్ ఉంది.
టికెట్ల కోసం కొట్లాట
ఓ పార్టీకి చెందిన నాయకులు నామినేషన్ల రెండో రోజు టికెట్ల కోసం కొట్లాడుకున్నట్లు పట్ణణంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకే పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయాయి. మీరు పలానా నేతలకు చెందిన వారని అందుకే టికెట్లు ఇవ్వడం లేదని చెప్పడంతో కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలైంది. అధికార పార్టీలో టికెట్ల కోసం కోట్లాడటం చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్లో మాత్రం టికెట్లు రాని వారు రెబల్గా బరిలో నిలుస్తామని చెబుతున్నారు. ఏది ఏమైన ఏ పార్టీకి రెబల్ బెడదా, అసంతృప్తులు ఎక్కువ ఉంటారో వారికే ఎన్నికల్లో ముప్పు రానుంది. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న బీజేపీ దాదాపుగా 16 వార్డుల్లో నామినేషన్లను దాఖలు చేయడంతో అక్కడ కూడా ఆశలు చిగురిస్తున్నాయి. రెండు మూడు సీట్లు గెలిచి కింగ్మేకర్ కానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.


