నవ వధువు అనుమానాస్పద మృతి
దుద్యాల్: దుస్తులు ఉతికేందుకు బావి వద్దకు వెళ్లిన ఓ నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన దుద్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీశైలం, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పోలేపల్లికి చెందిన బాయిగడ్డ నరేందర్కు గత అక్టోబర్లో మాధురి(25)తో వివాహం జరిగింది. ఎప్పటిలాగే వారి పొలంలోని బావి వద్ద దుస్తులు ఉతికేందుకు వెళ్లిన మాధురికి ఫిట్స్ రావడంతో బావిలో పడిపోయింది. ఈసమయంలో ఎవరూ లేకపోవడంతో గట్టున ఉన్న దుస్తులను చూసి బావిలో వెతకగా అప్పటికే మృతిచెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, మాధురి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె తల్లి జానకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీశైలం తెలిపారు.


