ప్రణాళికతో గ్రామాల అభివృద్ధి
● చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
● తంగడపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
చేవెళ్ల: గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని నియోజకవర్గంలోని అన్ని మండలాల అభ్యున్నతికి ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని తంగడపల్లిలో రూ.50 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువస్తానని తెలిపారు. నూతన పాలక వర్గం సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పామెన రాములు, కాంగ్రెస్ నాయకకులు తదితరులు పాల్గొన్నారు.
తప్పిన పెను ప్రమాదం
బషీరాబాద్: ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం మధ్యాహ్నం సేడం నుంచి తాండూరు వస్తున్న ఆర్టీసీ బస్సు(టీజీ34జడ్0076) బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలోకి రాగానే ముందలి టైర్ బ్లాస్ట్ అయ్యింది. అప్రమత్తమైన డ్రైవర్ నాగేంద్రప్ప బస్సును నిలిపివేశాడు. ఈ ఘటనలతో బస్సులో ప్రయాణిస్తున్న 25మంది ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బస్సు వేగంగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మెకానిక్ వచ్చి మరో టైర్ అమార్చడంతో ప్రయాణికులతో బస్సు తాండూరుకు బయలుదేరింది.


