
విధేయులకే పట్టం
రేసులో 12 మంది
గుట్కావిక్రేతలపై కేసు నిషేధిత గుట్కాలు విక్రయిస్తున్న ఆరుగురిపై షాబాద్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘పారదర్శకంగా...ప్రజాస్వామ్య బద్ధంగా డీసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని, ఐదేళ్లుగా సభ్యత్వం ఉండి, సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్న కార్యకర్తనే డీసీసీ పీఠం వరిస్తుంది’అని ఏఐసీసీ జిల్లా పరిశీలకులు, ఎంపీ సి.రాబర్ట్ బ్రూస్ చెప్పారు. డీసీసీ ఎన్నికల పరిశీలకుడిగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ఆయన గాంధీభవన్కు చేరుకున్నా రు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టకాలంలో పార్టీకి అందదండగా నిలిచి, అందరికి ఆమోద యోగ్యుడైన సమర్థుడినే డీసీసీ చీఫ్గా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా నామినేటెడ్ పోస్టుల చైర్మన్లు, పార్టీ జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, బ్లాక్ స్థాయి, మండల స్థాయి అధ్యక్షుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయం ప్రకారమే ఈ ఎంపిక ఉంటుందని చెప్పారు.
నేడు చేవెళ్ల నేతలతో భేటీ
కేవలం పార్టీ నేతల నుంచే కాకుండా పార్టీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబంధం లేని సామాజిక కార్యకర్తలు, సాధారణ ప్రజల నుంచి సైతం అభిప్రాయాలను సేకరించనున్నట్లు చెప్పారు. అయితే ఈ ఎంపికలో సాధారణ కార్యకర్త అభిప్రాయానికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేదన్నారు. సోమవారం(ఈనెల 13న) చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించి, ఉదయం ఎ–బ్లాక్, మధ్యాహ్నం బి–బ్లాక్ కేడర్తో సమావేశమై, వారి అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలిపారు. 16వ తేదీన శేరిలింగంపల్లి నియోజకవర్గం కేడర్తో భేటీ కానున్నట్లు చెప్పారు. ఔత్సాహికులు తమ దరఖాస్తులను స్వయంగా అందజేయవచ్చని సూచించారు. ఈ నెల 19 వరకు మొత్తం ప్రక్రియను పూర్తి చేసి, తుది జాబితాను ఏఐసీసీకి అందజేయనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షులు, పరిశీలకుల బృందం సభ్యుడు వినయ్రెడ్డి, కర్నె శ్రీనివాస్ పాల్గొన్నారు.
డీసీసీ ఎంపికలో కేడర్ అభిప్రాయానికే పెద్దపీట
రోజుకు రెండు బ్లాకుల చొప్పున సమావేశాలు
నేడు చేవెళ్ల ముఖ్య నేతలతో భేటీ
పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తాం
ఏఐసీసీ జిల్లా పరిశీలకులు, ఎంపీ సి.రాబర్ట్బ్రూస్
ఇదిలా ఉంటే డీసీసీ పీఠం కోసం ఇప్పటికే 12 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఐదుగురు, మహేశ్వరం నియోజకవర్గం నుంచి నలుగురు, చేవెళ్ల నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి యూత్ కాంగ్రెస్ నేత బొక్క చెన్నారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు ఉన్నారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నేత దేప భాస్కర్రెడ్డి డీసీసీ పీఠాన్ని ఆశిస్తున్నారు. ఇక ఎల్బీనగర్ నుంచి నాగోల్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాజిరెడ్డి సహా చేవెళ్ల నియోజకవర్గం నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భీం భరత్, పీసీసీ సభ్యుడు గౌరి సతీశ్ సైతం రేసులో ఉన్నారు. ఇక కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అయిళ్ల శ్రీనివాస్గౌడ్ సహా మరికొంత మంది డీసీసీ పీఠాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం. వీరంతా ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పోస్టుల చైర్మన్లు, స్థానిక సంస్థల చైర్మన్లు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు, ఎంపీపీలు, బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అభిప్రాయ సేకరణలో భాగంగా అధిష్టానానికి తమ పేర్లను సిఫార్సు చేయాల్సిందిగా వారు అభ్యర్థిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.