
‘ఓపెన్’ చాన్స్
కేశంపేట: అనివార్య కారణాలతో మధ్యలోనే చదువు నిలిపివేసిన యువతీ యువకులకు ఓపెన్ స్కూల్ వరంగా మారింది. చదువుకోవాలనే అశ ఉన్నా పాఠశాలలకు వెళ్లలేని వారికి చేయూతనివ్వాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా విద్యను అందిస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, కొన్ని ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందాలన్నా పదో తరగతి ఉత్తీర్ణత అవసరం. దీంతో చాలా మంది ఓపెన్ విద్య వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. పనులు చేసుకుంటూనే సెలవు దినాల్లో తరగతులకు హాజరుకావచ్చు.
అధ్యయన కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 65 ఓపెన్ టెన్త్, ఇంటర్ అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పహాడీషరీఫ్ జెడ్పీ ఉన్నత పాఠశాల, హఫీజ్పేట జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎన్టీఆర్ నగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఉర్డూ మీడియంలో సైతం చదువుకునే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లాలో 28 ఓపెన్ టెన్త్, ఇంటర్ అధ్యయన కేంద్రాలు, మెడ్చల్ జిల్లాలో 34 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు వెచ్చిస్తూ తోడ్పాటు అందిస్తోంది.
వీరు అర్హులు
● చదువు మధ్యలో ఆపేసినవారు, గృహిణులు, వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారు, ఓపెన్ విద్యలో అడ్మిషన్లు పొందొచ్చు.
● 14 ఏళ్లు నిండిన వారు పదో తరగతిలో అడ్మిషన్ పొందేందుకు అర్హులు.
● ఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సమర్పించాలి.
● అడ్మిషన్లు పొందిన వారు సెలవు దినాల్లో నిర్వహించే తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది.
● మరింత సమాచారం కోసం
www.telanganaopenschool.orgలో సంప్రదించాలి.
పదో తరగతి ప్రవేశాలకు..
● 14 సంవత్సరాల వయస్సు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
● పదవ తరగతిలో ఐదు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి.
● గతంలో పదో తరగతి రెగ్యులర్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన వారు ఓపెన్లో రెండు సజ్జెక్టుల మార్కులను బదలాయించుకోవచ్చు.
● రూ.1,150 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
● ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తుంది.
● అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఐదేళ్ల వరకు పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు..
● ఇంటర్మీడియెట్ అడ్మిషన్ల కోసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
● పదో తరగతి పాసై ఒక్క సంవత్సరం గ్యాప్ ఉంటేనే అర్హులు.
● విద్యార్థులకు ఐదు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి.
● రూ.1,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
● ప్రభుత్వం ఉచితంగా పాఠ్యా పుస్తకాలు అందిస్తుంది.
అవసరమైన పత్రాలు
● ఇటీవల తీసిన పాస్పోర్టు సైజ్ ఫొటోలు
● ఆధార్కార్డు
● ఇంటర్మీడియెట్ చదివేవారికి ఎస్ఎస్సీ సర్టిఫికెట్
● పుట్టిన తేదీ సర్టిఫికెట్ (పదో తరగతి అడ్మిషన్కు)
ఆగస్టు వరకు అవకాశం
● పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివేందుకు ఈనెల 31 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్ ఫీజుతో పాటు స్కూల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
● అపరాద రుసుం చెల్లించి ఆగస్టు 28వ తేదీ వరకు అడ్మిషన్లు పొందొచ్చు.
అక్షరాస్యులుగా మార్చేందుకు ..
నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో చదివే విద్యార్థుల నుంచి నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల వివరాలు, మహిళా సంఘాల నుంచి నిరక్షరాస్యుల వివరాలు సేకరిస్తోంది. వీరిలో పదో తరగతి వరకు చదవలేని వారు, చదువును మధ్యలో ఆపేసిన వారు, చదవడం, రాయడం వచ్చిన వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతిలో చేర్పించేందుకు ప్రతి మండలంలో అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
చదువు మధ్యలో మానేసిన వారికి..
పదోతరగతి, ఇంటర్లో అడ్మిషన్లు
ప్రత్యేక అధ్యయన కేంద్రాలు
ఈనెల 31 వరకు గడువు
అపరాధ రుసుముతో 28 ఆగస్టు వరకు
సద్వినియోగం చేసుకోవాలి
చదువును మధ్యలో అపివేసిన వారు, చదువుపై ఇష్టం ఉన్నవారికి ప్రభు త్వం అవకాశం కల్పించింది. ప్రతి మండల కేంద్రంలో ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశాం. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి.
– సత్యనారాయణ, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల కోఆర్డినేటర్

‘ఓపెన్’ చాన్స్