
ఫార్మా రైతులకు ప్లాట్లు
● లాటరీ ద్వారా కేటాయింపు షురూ ● మొదటి రోజు 60 గజాలలబ్ధిదారులకు.. ● ప్రక్రియను ప్రారంభించిన కలెక్టర్
కందుకూరు: వంద శాతం హక్కులతో పారదర్శకంగా ప్రభుత్వం ఫార్మా రైతులకు ప్లాట్లను అందజేస్తోందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని మీర్ఖాన్పేట రెవెన్యూలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లో సోమ వారం కందుకూరు, యాచారం మండలాలకు చెందిన భూ నిర్వాసితులకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించారు. మొదటి రోజు 60 గజాల లబ్ధిదారులు 670 మందికి ప్లాట్లు కేటాయించారు. అక్కడే చేపట్టిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ ఏర్పాటు చేసిన లేఅవుట్లో ప్రభుత్వమే అన్ని సదుపాయాలతో అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఎలాంటి ఖర్చు లేకుండా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నామన్నారు. ఈ ప్రాంతం నుంచి భవిష్యత్లో రేడియల్ రోడ్డు నిర్మాణం జరగనుందని చెప్పారు.
రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే సబితారెడ్డి
లాటరీ ప్రారంభానికి కంటే ముందే స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. తొందరపడి ఎవరూ ప్లాట్లు విక్రయించొద్దని, భవిష్యత్లో మంచి లాభం వస్తుందని సూచించారు. అంతకుముందు అక్కడ జరుగుతున్న ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను గురించి ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
గత ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుకు సంకల్పించిందని, దీంతో ఈ ప్రాంతం నాశనమయ్యేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం రేవంత్రెడ్డి ఈ ప్రాంతం అభివృద్ధికి కట్టుబడి ఉండేలా ఫ్యూఛర్సిటీని ప్రకటించారన్నారు. రైతుల భూముల విలువలు మరింత పెరుగుతాయని, భవిష్యత్లో గజం ధర రూ.లక్ష పలుకుతుందన్నారు. 320 అడుగుల రహదారి రానుందన్నారు.
పర్యవేక్షించిన అధికారులు
మొదటి రోజు కుర్మిద్ద, మేడిపల్లి, మీర్ఖాన్పేట, ముచ్చర్ల, నానక్నగర్, పంజగూడ, తాటిపర్తి రెవెన్యూ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 60 గజాల చొప్పున ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించారు. కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు ఎఫ్సీఏడీఏ కమిషనర్ శశాంక, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, ఆర్డీఓలు జగదీశ్వర్రెడ్డి, అనంత్రెడ్డి, డీపీఓ సురేష్మోహన్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రావణ్కుమార్, డీసీపీ సునీతరెడ్డి తదితరులు లాటరీ ప్రక్రియను పర్యవేక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు గోపాల్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.
నేడు 121 గజాల ప్లాట్ల కేటాయింపు
ఫార్మాసిటీ రైతులకు 121 గజాల ప్లాట్ల కేటా యింపు మంగళవారం ఉంటుందని ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మీర్ఖాన్పేట రెవెన్యూలోని లేఅవుట్లోని ఏటీసీ సెంటర్లో ఉదయం 8 గంటల నుంచి లాటరీ ద్వారా ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కుర్మిద్ద, మేడిపల్లి, మీర్ఖాన్పేట, బేగరికంచె గ్రామాల రైతులకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు.. ము చ్చర్ల, సాయిరెడ్డిగూడ, సార్లరావులపల్లి, ఆకులమైలారం, అన్నోజిగూడ, తాడిపర్తి, నానక్నగర్ గ్రామాల రైతులకు మధ్యాహ్నం నుంచి సా యంత్రం పూర్తయ్యే వరకు కొనసాగుతుందని తెలిపారు. లబ్ధిదారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు.