
‘చెరువుల అభివృద్ధి వేగంగా జరగాలి’
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చెరువుల అభివృద్ధి వేగంగా జరగాలని, మొదటి విడతగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఆరు చెరువులూ వీలైనంత త్వరలో అందుబాటులోకి రావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ వర్షాకాలంలోనే ఆయా చెరువులన్నీ స్వచ్ఛమైన నీటితో కళకళలాడాలని స్పష్టం చేశారు. బుధవారం తమ్మిడికుంట, సున్నం చెరువులను ఆయన సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. తమ్మిడికుంటలో 26 ఎకరాల మేర నీరు నిలిచేలా, మరో నాలుగు ఎకరాల్లో పర్యావరణానికి పెద్ద పీట వేస్తూ అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు బండ్ బలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చెరువు కింద లోతట్టు ప్రాంతంతో పాటు భవనాలు ఉన్న దృష్ట్యా బండ్కు వెలుపల భాగంలో కాంక్రీట్తో నిర్మించాలని అన్నారు. ఈ పనులకు ఎక్కడా ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సున్నం చెరువు మొత్తం 32.20 ఎకరాలు కాగా ఇప్పుడు కేవలం 14.18 ఎకరాల్లోనే నీరు నిలుస్తోందని, దీన్ని పూర్తి స్థాయికి విస్తరించాలని రంగనాథ్ సూచించారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్