
మరియా ఫీడ్ కంపెనీకి సీల్
ధారూరు: మండల పరిధిలోని దోర్నాల్ గ్రామ సమీప 113 సర్వేనంబర్లో ఉన్న మరియా ఫీడ్ కంపెనీకి తహసీల్దార్ సాజిదాబేగం బుధవారం తాళం, సీల్ వేశారు. కంపెనీ నుంచి దుర్వాసన వస్తోందని, ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని మంగళవారం రాత్రి గ్రామస్తులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆర్డీఓ వాసుచంద్ర, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి ఆందోళనకారులను శాంతింపజేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల నివేదిక వచ్చే వరకు కంపెనీని మూసేస్తున్నామని తహసీల్దార్ తెలిపారు. అప్పటి వరకు ఫ్యాక్టరీలోకి వాహనాలు రాకుండా రోడ్డుకు అడ్డంగా ట్రెంచ్ తవ్వించామన్నారు. ఆమె వెంట డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఏఎస్ఐ సంగమేశ్వర్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
యువకుడి ప్రాణం తీసిన ట్రక్కు
షాబాద్: ట్రక్కు దూసుకెళ్లడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సతీశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చందనవెళ్లి కుందానా కంపెనీలో వలస కార్మికుడిగా పనిచేస్తున్న ప్రమోద్కుమార్ (35) బుధవారం వాష్రూమ్కు వెళ్తున్నాడు. అదే సమయంలో అక్కడే కంటైనర్లను లిఫ్ట్ చేసే ట్రక్కు డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడపడంతో అదుపుతప్పి ప్రమోద్కుమార్పై నుంచి వెళ్లింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతడిని శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టీటీడీ ఆలయం హుండీలో చోరీ.. పోలీసులకు ఫిర్యాదు
ఫిలింనగర్: జూబ్లీహిల్స్లోని టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీలో నగదు దొంగలిస్తుండగా భక్తులు వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకొని ఆలయ వర్గాలకు అప్పగించారు. అయితే మైనర్ బాలుర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలయ వర్గాలు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి చోరీ చేసిన నగదును తిరిగి హుండీలో వేయించి పంపించారు. అయితే కొద్ది రోజుల తర్వాత అందులో ఓ బాలుడు మళ్లీ ఆలయానికి వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆలయ ఏఈఓ రమేష్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 28న ఓ బాలుడు సన్నిధిలో ఉన్న హుండీలో నుంచి డబ్బులు తీస్తుండగా భక్తులు గమనించి తమకు అప్పగించారని, ఆ కొద్ది దూరంలోనే తమ విజిలెన్స్ సిబ్బంది మరో బాలుడిని పట్టుకోవడం జరిగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

మరియా ఫీడ్ కంపెనీకి సీల్