
మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యత
● మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్
ఆమనగల్లు: ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభు త్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. పట్టణంలోని కళ్యాణి గార్డెన్స్లో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు చెందిన 167 మంది మైనార్టీ మహిళలకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ.. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల కింద దాదాపు లక్ష మైనార్టీ కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 43 వేల మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వితంతు, విడాకులు పొందిన, ఒంటరి ముస్లిం మహిళలు 5 వేల మందికి రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గుర్తించిన వెయ్యిమంది సంచార ముస్లిం కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం అందిస్తున్నట్లు వివరించారు. యువ వికాసం పథకం కింద 45 వేల మంది ముస్లింలకు రూ.850 కోట్లు అందించనున్నట్లు ఆయన తెలిపారు. 6 వేలమంది ముస్లిం మైనార్టీ విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి చూపుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అంతకుముందు 41 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్, మార్కెట్ మాజీ చైర్మన్ కిషన్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాస్రెడ్డి, చెంచు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండ్లి రాములు, మైనార్టీ సంక్షేమ శాఖ డీఎం నవీన్రెడ్డి, తహసీల్దార్లు లలిత, ముంతాజ్, నాగార్జున, ఎంపీడీఓ మాధురి, మండల ప్రత్యేకాధికారి శోభారాణి, మున్సిపల్ కమిషనర్ శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.