
వరుణ దేవా.. కరుణించవా!
యాచారం: రెండేళ్లుగా వర్షాలు సమృద్ధిగా లేక భూగర్భజలాల అడుగంటుతున్నాయి. ఈ ఏడాది సైతం గత పరిస్థితే ఉత్పన్నమయితే ఎలా అని రైతులు భయాందోళన చెందుతున్నారు. నాగార్జునసాగర్ (మిషన్ భగీరథ) కృష్ణా జలాలతోనే మహానగరంతో పాటు జిల్లావాసుల దాహార్తి తీర్చుతున్నారు. సాగర్లోనూ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుతుండడంతో కృష్ణా జలాలు సైతం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పెద్ద చెరువు, తుర్కయంజాల్ చెరువు మినహాయిస్తే జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలన్నీ ఎండిపోయి నెర్రలుబారాయి.
బంధం చెరువు నిండితేనే..
జిల్లాలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మాడ్గుల, కడ్తాల్, తలకొండపల్లి, కందుకూరు, ఆమనగల్లు, మహేశ్వరం తదితర మండలాల్లోని 300కు పైగా చెరువులు, కుంటలు పూర్తిగా వట్టిపోయాయి. రెండేళ్లుగా వర్షాలు లేక చెరువులు, కుంటల్లోని నీళ్లు చేరడం లేదు. జిల్లాలో సాగునీటి వనరులు లేవు. వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండితే తప్పా బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగే పరిస్థితి లేదు. యాచారం, కడ్తాల్, కందుకూరు మండలాల సరిహద్దులోని తాడిపర్తి బంధం చెరువు నిండితే యాచారం మండల పరిధిలోని నానక్నగర్, నక్కర్తమేడిపల్లి, మల్కీజ్గూడ, తక్కళ్లపల్లి, చింతపట్ల, నల్లవెల్లి, మల్కీజ్గూడ, కుర్మిద్ద తదితర గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండి కడ్తాల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లోని భూగర్భజలాలు సంవృద్ధిగా ఉంటాయి.
ప్రమాదకర స్థాయిలో బోరుబావులు
యాచారం, మంచాల, కందుకూరు, కడ్తాల్, ఆమ నగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, ఇబ్రహీంపట్నం తదితర మండలాల్లో 50 వేలకు పైగా బోరుబావులు వట్టిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం 30 వేలకు పైగా బోరుబావులు వట్టిపోయాయి. మృగశిర కార్తెలో సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే బోరుబావుల్లో భూగర్భజలాలు పెరుగుతాయి. ఇప్పటికీ సరైన వర్షాలు కురువక పోవడంతో రైతులు వరినారు పోసుకునేందుకు ముందుకు రావడం లేదు.
నెర్రెలు బారుతున్న చెరువులు, కుంటలు
వట్టిపోతున్న బోరుబావులు
వర్షాల కోసం రైతు ఎదురుచూపులు