
ప్రమాదాలకు హైవే
చేవెళ్ల: హైదరాబాద్–బీజాపూర్ రహదారి విస్తరణ ప్రతిపాదనలకే పరిమితమైంది. ఈ మార్గం నేషనల్ హైవేగా అప్గ్రేడ్ అయిందని.. ఇక త్వరలోనే రోడ్డు విస్తరణ పూర్తవుతుందని పదేళ్లుగా చెబుతున్నా కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. నిత్యం వాహనాల రద్దీతో ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే జనం జంకుతున్నారు. దీనికి తోడుగా రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో వర్షాలకు నీరు నిలిచి చెరవులను తలపిస్తున్నాయి. నేషనల్ హైవేగా మారడంతో ఆర్అండ్బీ శాఖ ఇటువైపు చూడడం మానేసింది. మలుపులు, గుంతల కారణంగా ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి.
ఎన్హెచ్ అధికారులు లేక ..
పట్టణ కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్ ఎదుట పెద్ద గుంత ఏర్పడింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీరు నిలిచి ప్రమాదకరంగా మారింది. గతంలో దాతలు, ట్రాఫిక్ పోలీసులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా వర్షం నీరు వెళ్లే మార్గం లేక చిన్నపాటి వర్షానికి సైతం నీరు నిలిచి ప్రమాదాలకు కారణమవుతోంది. తాజాగా పోలీసులు మున్సిపల్ అధికారులకు, ఎంపీడీఓకు మరమ్మతులు చేపట్టాలని వినతులు ఇచ్చారు. ఎన్హెచ్ అధికారులు అందుబాటులోకి రాకపోవడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. విస్తరణ చేపట్టకపోయినా.. కనీసం మరమ్మతులైనా చేపట్టాలని స్థానికులు, వాహనదారులు అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
హైదరాబాద్–బీజాపూర్ హైవేపై ప్రయాణం అంటేనే జనం జంకుతున్నారు. చిన్న రోడ్డు, మూలమలుపులతో పాటు రోడ్డుపై ఏర్పడిన గుంతల కారణంగా వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం వాహనాల రద్దీతో ఉండే ఈ మార్గం ప్రమాదాలకు నిలయంగా మారింది.
పదేళ్లుగా ప్రకటనలకే పరిమితమైన హైదరాబాద్–బీజాపూర్ రహదారి విస్తరణ
ప్రాణాలు కోల్పోతున్న వాహనదారులు
పట్టించుకోని పాలకులు
డ్రైన్ నిర్మిస్తేనే..
హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై చేవెళ్ల పరిధిలో ఎన్నో చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. గతంలో తమ వంతు బాధ్యతగా ఎన్నోసార్లు దాతల సహకారంతో గుంతలను పూడ్చాం. చిన్నపాటి వర్షం కురిస్తే సమస్యల మళ్లీ మొదటికి వస్తుంది. స్థానిక కేజీఆర్ గార్డెన్ ఎదుట పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. డ్రైన్ నిర్మాణం చేస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరాం.
– ఎస్.వెంకటేశం, ట్రాఫిక్ సీఐ, చేవెళ్ల

ప్రమాదాలకు హైవే

ప్రమాదాలకు హైవే