
పుప్పాల్ గూడలో స్ట్రంచ్ తవ్వకుండా భూమిపై నుంచే పరిచిన కేబుళ్లు
ప్రైవేటు కాంట్రాక్టర్లతో ఇంజనీర్ల కుమ్మక్కు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: గ్రేటర్లో భూగర్భ కేబుళ్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. అంచనాలకు భిన్నంగా పనులు చేయడంతో పాటు ప్రతిపాదిత మార్గానికి భిన్నంగా లైన్లు తవ్వుతుండటం.. నిర్ధేశిత ప్రమాణాలకు భిన్నమైన కేబుళ్లు, విద్యుత్ పరికరాలు వాడుతుండడంతో లైన్లు వేసిన కొద్ది రోజులకే దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా ఐటీ, అనుబంధ కంపెనీలకు, భారీ గృహ, వాణిజ్య సముదాయాలకు నిలయమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చేపడుతున్న భూగర్భ కేబుల్ (యూజీ) పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రైవేటు కాంట్రాక్టర్లతో ఇంజనీర్లు కుమ్మకై.. ఆయా రియల్ ఎస్టేట్ డెవెలపర్స్, వినియోగదారులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. వాస్తవ ఖర్చుకు భిన్నంగా అంచనాలు రూపొందించడంతో పాటు అడ్డగోలుగా లైన్లు వేస్తున్నారు. నాసిరకం పనులు చేపడుతుండటంతో వేసిన కొద్ది రోజులకే ఆయా లైన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే కాన్సులేట్ కార్యాలయానికి చేపట్టిన యూజీ కేబుల్ పనులు సహా కొండాపూర్, ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, సరూర్నగర్, కందుకూరు, బంజారాహిల్స్, కూకట్పల్లి, మేడ్చల్, జీడిమెట్ల, హబ్సిగూడ డివిజన్ల పరిధిలో చేపడుతున్న యూజీ కేబుల్ పనులను శ్రీకేబుల్ టెస్టింగ్ వ్యాన్ల ద్వారా తనిఖీ చేపడితే అక్రమాలన్నీ బయటపడే అవకాశం ఉంది.
ఓ డెవలపర్స్కు నోటీసులు
పుప్పాల్గూడ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేటు డెవలపర్స్ సంస్థ రెండేళ్ల క్రితం విద్యుత్ సరఫరా కోసం దరఖాస్తు చేసుకుంది. డిస్కం ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనాలు రూపొందించారు. సదరు సంస్థకు 9,951 కిలోవాట్స్ సామర్థ్యంతో కూడిన డిమాండ్ అవసరం ఉన్నట్లు గుర్తించారు. సమీపంలోని సబ్స్టేషన్ నుంచి భూగర్భ కేబుల్ లైన్ వేసుకోవాల్సిందిగా సూచించి, ఆ మేరకు ఏ సబ్స్టేషన్ నుంచి ఏ మార్గంలో లైను వేయాలి? ఎన్ని అడుగుల లోతు తవ్వాలి? ఎంత సామర్థ్యంతో కూడిన కేబుల్ వేయాలి? కేబుల్ రక్షణ కోసం ఎంత పరిమాణంలో ఇసుక పోయాలి? కేబుళ్లపై ఏ సైజులో ఉన్న షాబాద్ బండలు పరచాలి? వంటి అన్ని అంశాలను ఎస్టిమేషన్లో పొందుపర్చారు. పనులు దక్కించుకున్న ప్రైవేటు కాంట్రాక్టర్ అంచనాలకు భిన్నంగా కేబుల్ పనులు చేసినట్లు గుర్తించారు.
నిజానికి 1.5 మీటర్ల లోతులో వేయాల్సిన కేబుళ్లను భూమిపైనే పరిచ్చారు. కేబుల్ కింది భాగంలో 50 ఎంఎం, పై భాగంలో 250 ఎంఎం మందం ఇసుక పోయాలి. ఆర్వాత కేబుల్కు రక్షణగా 40 ఎంఎం షాబాద్ బండలు అమర్చాల్సి ఉంది. కానీ సదరు కాంట్రాక్టర్ పూర్తి నాసిరకంగా పనులు చేపట్టినట్లు గుర్తించారు. అంతేకాదు అధికారులు సూచించిన ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతం నుంచి స్ట్రంచ్ తవ్వినట్లు నిర్ధారించారు. కేబుళ్ల మధ్య ప్రతి మూడు మీటర్లకు ఇటుకలతో హారిజంటల్ లైన్ ఏర్పాటు చేయాలి. సదరు కాంట్రాక్టర్ ఇవేవీ పట్టించుకోలేదు.
నాసిరకం పనులతో తరచూ కేబుళ్లు దెబ్బతినడం, విద్యుత్ లీకేజీ సహా షార్ట్సర్క్యూట్లు తలెత్తి ఆయా భవన సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు ప్రమాదవశాత్తు లైను మీదుగా వెళ్లేవారు షార్ట్సర్క్యూట్తో ప్రమాదానికి గురై మృతి చెందే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ పనులను నిలిపివేయాల్సిందిగా ఇప్పటికే డిస్కం సదరు డెవెలపర్స్కు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
ఆ భవనాలకు కుచ్చుటోపీ
భూగర్భ కేబుల్ కాంట్రాక్టర్లు అదే ప్రాంతంలోని ఓ ప్రముఖ ఆస్పత్రి సహా బ్యాంకు, ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలను మోసం చేశారు. ఆర్సీపురం 130 కేవీ సబ్స్టేషన్ నుంచి ఓ బ్యాంకు కోసం వేసిన భూగర్భ కేబుల్ లైన్ పనులు అంచనాలకు భిన్నంగా ఉన్నట్లు తెలిసింది. ఏకంగా 55 శాతం లెస్తో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆ తర్వాత క్షేత్రస్థాయి ఇంజనీర్లతో కుమ్మక్కు..రివర్స్ టెండరింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడినట్లు సమాచారం. అదే విధంగా ఓ ప్రముఖ బహుళ అంతస్తుల భవనం సహా ఆస్పత్రి లైన్లను కూడా అంచనాలకు భిన్నంగా వేశారు. రెండు సంస్థల నుంచి వేర్వేరు చార్జీలు వసూలు చేసి, సింగిల్ స్ట్రంచ్ నుంచే కేబుల్స్ వేశారు. యూజీ కేబుల్ లైన్లపై దరఖాస్తుదారులకు కానీ, డెవెలపర్లకు కానీ సరైన అవగాహన లేకపోవడం కూడా కాంట్రాక్టర్లకు కలిసి వస్తోంది.
భూగర్భ కేబుల్ పనులన్నీ ప్రైవేటు కాంట్రాక్టర్లే చేస్తున్నప్పటికీ.. ఆయా పనులను సంబంధిత డివిజన్ ఇంజనీర్లు పర్యవేక్షించాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడి వారు నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. తీరా పనులు పూర్తయిన తర్వాత కేబుళ్లు భూమిపై తేలి కన్పిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏదో ఒక పేరుతో ఆయా మార్గాల్లో తరచూ తవ్వకాలు చేపడుతుండటం.. కేబుల్ లైన్లపై ఎలాంటి హెచ్చరికల బోర్డులు లేకపోవడం.. భారీ వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుండటంతో వేసిన కొద్ది రోజులకే కేబుళ్లు దెబ్బతింటున్నాయి. షార్ట్ సర్క్యూట్లు తలెత్తి ఆయా సంస్థలకు సరఫరా నిలిచిపోతోంది. విషయం తెలియక ఆయా భవనాల్లోని వినియోగదారులు ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా డిస్కంపై తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. ఇటీవల ఈ తరహా ఫిర్యాదులనే డిస్కం ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోంది.